హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దివ్యాంగురాలైన యువతిని సకలాంగుడు పెండ్లి చేసుకుంటే అందించే నగదు ప్రోత్సాహకంతోపాటు కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్ ఆర్థిక సాయాన్ని కూడా పొందవచ్చని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్ శైలజ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సకలాంగుడు దివ్యాంగురాలిని పెండ్లి చేసుకొంటే ప్రభుత్వం ఆ జంటకు రూ.లక్ష నగదు ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 ప్రకారం కల్యాణలక్ష్మి / షాదీముబారక్ కింద అందించే మొత్తానికి అదనంగా 25 శాతాన్ని అంటే రూ.1,25,145 కూడా అందిస్తున్నది.
ఈ మేరకు ఆ జంటకు మొత్తం రూ.2,25,145 సాయం అందజేస్తున్నది. కాగా, కల్యాణలక్ష్మి / షాదీముబారక్ పొందిన వారు ప్రభుత్వం దివ్యాంగులకు అందించే వివాహ నగదు ప్రోత్సహకానికి అనర్హులని సాగుతున్న ప్రచారాన్ని శైలజ ఖండించారు. అర్హులైన దివ్యాంగులు రెండు పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని స్పష్టంచేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల సంక్షేమ అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసినట్టు పేర్కొన్నారు.