హైదరాబాద్, మార్చి 9, (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయడానికి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బస్ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 2017 పీఆర్సీ, 2021 పీఆర్సీ ప్రకారం వేతనాలను సవరించాలని ఆర్టీసీ ఉద్యోగులు చేసిన అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న 21 శాతం ఫిట్మెంట్తో 2017 పేమెంట్ రివిజన్ కమిషన్ అమలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఏప్రిల్ 1, 2017 నుంచి 31.1 శాతం డీఏ కలిపి 21 శాతం ఫిట్మెంట్తో సర్దుబాటు చేసిన జీతం ఈ ఏడాది జూన్ 1 నుంచి చెల్లిస్తామని చెప్పారు. 2017లో పేస్కేల్ బకాయిలు ఏమైనా ఉంటే పదవీ విరమణ సమయంలో ఎలాంటి వడ్డీ మినహాయింపు లేకుండా చెల్లిస్తారని తెలిపారు. ‘2017 పేస్కేల్ను 21 శాతం ఫిట్మెంట్తో అమలు చేయడం వల్ల ఏటా రూ. 418.11 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా వేశామని’ మంత్రి పేర్కొన్నారు. కొత్త పేస్కేల్ 2017 పేస్కేల్లోని 42,057 మంది ఉద్యోగులకు, ఏప్రిల్ 1, 2017న పదవీ విరమణ పొందిన 11,014 మంది ఉద్యోగులకు కలిపి మొత్తం 53,071 మందికి ప్రయోజనం చేకూరుతుందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.