హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ఆదివారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. 21 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఉద్యోగులతో ముచ్చటించారు. వేతన సవరణతో ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని తెలిపారు. మిగతా సమస్యలను ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎండీ హామీ ఇచ్చారు. మెరుగైన, నాణ్యమైన సేవలందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి, జాతీయ స్థాయిలో సంస్థకు మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వర్చువల్ సమావేశంలో సీవోవో డాక్టర్ రవీందర్, ఈడీ మునిశేఖర్, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వయిజర్ విజయపుష్ప, సీపీఎం ఉషాదేవి, సీటీఏ జీవనప్రసాద్, సీటీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.