హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలను, ఆయా వర్గాల డిమాండ్లను పరిష్కరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించింది. వేతన స్కేలు కోసం రెండు దశాబ్దాలుగా వేచి చూస్తున్న సెర్ప్ ఉద్యోగుల డిమాండ్ను నెరవేర్చింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు వీరిని ఏనాడూ పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో స్పందించి వారికి పే స్కేల్ను అమలు చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ నెల ప్రభుత్వ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సెర్ప్లోని 3,974 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.58 కోట్లు అదనంగావెచ్చించనున్నది. ప్రస్తుతం వారికి వేతనాల రూపంలో ఏటా రూ.192 కోట్లు చెల్లిస్తున్నది. ఇకపై సెర్ప్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు పొందనున్నారు.
సెర్ప్లోని ఒక్కో క్యాడర్ ఉద్యోగికి ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా వేతనం చెల్లించాలో ఉత్తర్వులో పేర్కొన్నారు. ఉదాహరణకు కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ (సీసీ)లకు జూనియర్ అసిస్టెంట్ హోదా, ప్రాజెక్టు మేనేజర్లకు ఎంపీడీవో హోదా ఇచ్చారు. సెర్ప్ ఉద్యోగులకు ప్రస్తుతం డీఏ అమలులో లేదు. పేస్కేల్ అమలు ద్వారా డీఏ కూడా వర్తింపజేయనున్నారు. దీంతో భారీ ఎత్తున వేతనాలు పెరుగుతాయని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగులు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
సెర్ప్ ఉద్యోగులకు పే సేల్ వర్తింపజేస్తూ జీవో రావడంతో వారంతా శనివారం సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. శనివారం హైదరాబాద్ సెర్ప్ ప్రధాన కార్యాలయంలో సెర్ప్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ జిల్లా భీంఘల్లో జరిగిన క్షీరాభిషేకం కార్యక్రమంలో సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్రెడ్డి, నరసయ్య, సుదర్శన్, సుభాష్, జానయ్య, వెంకట్, సురేఖ, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, ఇల్లెందు, పెనుబల్లి మండలాల్లో సీఎం కేసీఆర్ కటౌట్లకు క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు. మెదక్, సంగారెడ్డిలో కూడా సెర్ప్ ఉద్యోగులు సీఎం చిత్రపటంతోపాటు మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జీవో రావడానికి సహకరించిన మంత్రులు హరీశ్రావు, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ కవితకు జేఏసీ తరఫున గంగాధర్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు: మంత్రి హరీశ్ రావు
దీర్ఘకాలికంగా ఉన్న సెర్ప్ ఉద్యోగుల డిమాండ్ను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా నేరవేర్చామని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్ రావు తెలిపారు. ట్విట్టర్లో ఆయన శనివారం సెర్ప్ ఉద్యోగుల పే స్కేల్ను పోస్టు చేస్తూ.. జీవో విడుదల చేసినందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం జీవో విడుదల చేశామని పేర్కొన్నారు.
కేసీఆర్కు ధన్యవాదాలు మంత్రి దయాకర్ రావు
సెర్ప్ ఉద్యోగుల కోరికను మన్నించి, ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారి కలను నిజం చేసిన మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. సెర్ప్ ఉద్యోగుల పక్షాన ఆయన సీఎంకే ధన్యవాదాలు తెలిపారు. సెర్ప్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.