హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) నేత కార్మికులకు సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురసరించుకొని సోమవారం నుంచి ‘నేతన్న బీమా’ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. నేతన్నల కోసం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే తొలిసారి అని చెప్పారు. దాదాపు 80 వేల మంది నేత కార్మికుల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనుండటం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
నేత కార్మికుడు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించే ఈ పథకం చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ పథకం ఉదాహరణ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుంటే, కేంద్రం మాత్రం పన్ను పెంపుతో చేనేత, పవర్లూం రంగాన్ని కుదేలు చేస్తున్నదని విమర్శించారు. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని చేనేత రంగానికి, ఆ రంగంపై ఆధారపడ్డ పద్మశాలీ తదితర కుటుంబాలకు బాసటగా నిలుస్తామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.