Bharat Bhushan | హైదరాబాద్ : సాహిత్యం, చిత్రకళ, పోటోగ్రఫీ తదితర సాంస్కృతిక, సృజనాత్మక రంగాల ద్వారా తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబిస్తూ, తమ జీవిత కాలం కృషి చేసిన నాటి తెలంగాణ కళాకారుల కుటుంబాలను ఆదుకుంటూ మానవీయ పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా మరో నిర్ణయం తీసుకున్నది.
ప్రఖ్యాత ఫోటో జర్నలిస్టు, చిత్రకారుడు, దివంగత భరత్ భూషణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. భరత్ భూషణ్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్లోని జియాగూడలో డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి ఆదుకున్నారు. పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబానికి తానున్నానంటూ రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది.
గతంలో భరత్ భూషణ్ తీవ్ర అనారోగ్యంతో భాధపడుతున్నప్పుడు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి ఆరోగ్య నిధి నుండి ప్రభుత్వం చేయూతనందించింది. కాగా తమను కష్టకాలంలో ఆదుకుంటూ, ఇప్పుడు తమకు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించి మరోసారి అండగా నిలిచినందుకు భరత్ భూషణ్ భార్య సుభద్రమ్మ, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.