హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ, ఇన్ఫ్లో, ఔట్ఫ్లోతోపాటు ప్రాజెక్టు సమస్త సమాచారాన్ని ఎప్పటికప్పుడు పక్క రాష్ర్టాలకు అందివ్వాల్సిన బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఇకనైనా కేంద్ర జల్శక్తిశాఖ గెజిట్ ప్రకారం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే అందజేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కు, కేంద్ర జలసంఘానికి రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ ఘాటు లేఖ రాశారు. ప్రాజెక్టు వివరాలను ఎప్పటికప్పుడు ముంపు ప్రభావిత రాష్ర్టాలకు అందజేయాల్సి ఉంది.
2014లో విడుదల చేసిన గెజిట్లో కేంద్ర జల్శక్తిశాఖ స్పష్టం చేసింది. ట్రిబ్యునల్ అవార్డు కూడా ఆ బాధ్యతలను పీపీఏకే అప్పగించింది. వాననాకాలం సీజన్మొత్తం ముగిసిన తరువాత, అదీ ఇతర రాష్ర్టాలు కోరితే తప్ప సంబంధిత సమాచారాన్ని షేర్ చేయడం లేదు. అదీగాక భద్రాచలం వద్ద దిగువకు వెళ్తున్న వరద ప్రవాహానికి, పోలవరం ప్రాజెక్టు వద్ద రికార్డు అవుతున్న వరదకు భారీగా వ్యత్యాసముంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు తాజాగా పీపీఏకు, సీడబ్ల్యూసీకి లేఖను రాసింది. కేంద్ర జలశక్తి మార్గదర్శకాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని సూచించింది.