హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్లను ఏ ప్రాతిపదిన రూపొందించారో అందుకు సంబంధించిన ఆధార పత్రాలన్నింటినీ వెంటనే అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. దీనిపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శనివారం మరోసారి లేఖ రాశారు.
రూల్కర్వ్లు, జలవిద్యుత్తు తదితర అంశాలపై సీడబ్ల్యూసీ రూపొందించిన ముసాయిదాపై కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) ఇప్పటికే మూడుసార్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలతో చర్చించింది. సీడబ్ల్యూసీ డ్రాఫ్ట్లో శ్రీశైలం ప్రాజెక్టు ఎండీడీఎల్ను 854గా ప్రతిపాదించడాన్ని తెలంగాణ మొదటి నుంచీ తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. అయితే 37 ఏండ్ల నీటి ప్రవాహాలను పరిగణనలోనికి తీసుకొని రూల్కర్వ్లను రూపొందించినట్టు సీడబ్ల్యూసీ గతంలో తెలపగా, అది డ్యామ్ పారామీటర్స్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనేది తెలంగాణ వాదన. ఈ నేపథ్యంలో తదుపరి ఆర్ఎంసీ సమావేశాన్ని నిర్వహించేలోగా రూల్కర్వ్ రూపకల్పనకు సంబంధించిన పూర్తి ఆధార పత్రాలన్నింటినీ అందజేయాలని తెలంగాణ డిమాండ్ చేసింది.