Minister Harish Rao | దశాబ్దం ముంగిట నిలిచిన తెలంగాణ 76 ఏండ్ల చరిత్ర కలిగిన స్వతంత్ర భారతానికి ఆదర్శ రాష్ట్రంగా రూపుదిద్దుకోవడం ఒక అసాధారణ పరిణామం. ఈ అద్భుతానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నిలిచారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. మంత్రమేస్తెనో, మాయ చేస్తెనో జరిగిన అద్భుతం కాదిది. ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యలే ఇతివృత్తంగా సంపూర్ణమైన అవగాహన, నిజాయితీతో కూడిన నిబద్ధత, నిర్విరామ కృషి… ఈ మూడింటి వల్లనే ఈ అసాధారణ ప్రగతి సాధ్యమైంది.
తెలంగాణ దృక్పథంతో సమూలమైన మార్పులు జరిపి, సమర్థవంతమైన, సమగ్రమైన ప్రణాళికలను అమలు చేయడం వల్ల అన్నిరంగాల్లోనూ అనూహ్యమైన అభివృద్ధి సాకారమైంది. ఇందులో భాగంగా వైద్యారోగ్య రంగం సైతం మునుపెన్నడూ లేనంతగా పురోగమించింది. దవాఖానలలో అధునాతన వైద్య సదుపాయాలు కల్పిస్తూ, జనాభా నిష్పత్తికి అనుగుణంగా వైద్యాలయాలను ఏర్పాటు చేస్తూ, సిబ్బందిని సమకూరుస్తూ.. అత్యుత్తమ వైద్యసేవలందిస్తున్న రాష్ట్రం గా తెలంగాణ రికార్డు సృష్టించింది. నీతి ఆయోగ్ నివేదిక సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ వైద్యారోగ్య రంగంలో తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా పేర్కొన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పరిపాలనలో వైద్యారోగ్య రంగం బలోపేతమైంది. సేవలు విస్తృతమయ్యాయి. వైద్యం ప్రజలకు చేరువైంది. భారీ ఎత్తున ఒనగూరిన మౌలిక వసతులతో తెలంగాణ వైద్యారోగ్య రంగం ఎటువంటి హెల్త్ ఎమర్జెన్సీని అయినా తట్టుకోవడానికి సర్వసన్నద్ధంగా రూపొందింది.
తెలంగాణ వైద్యారోగ్యరంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అపురూప ఘట్టాలను ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ నిర్మాణం.. ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం. అత్యంత స్వల్ప వ్యవధిలో 21 నూతన మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ తెలంగాణను మెడికల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చారు. మెడికల్ సీట్లు భారీగా పెరగడంతో తెలంగాణ విద్యార్థులకు విదేశాల్లో మెడిసిన్ చదవాల్సిన అగత్యం తప్పింది.
రాబోయే కొద్దిరోజుల్లోనే తెలంగాణలో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరుకోనుంది. ఈ కాలేజీల ద్వారా అత్యున్నత ప్రమాణాలు కలిగిన వైద్యవిద్యతోపాటు, వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇది తెలంగాణ స్వీయ ప్రతిపత్తితో, సొంతనిధులతో సాధించిన విప్లవాత్మక విజయం. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున చేస్తున్న కృషికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వీసమెత్తు సహాయం కూడా చేయలేదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి, పర్మిషన్లు సాధిస్తే, ‘గైరోంకీ షాదీమే అబ్దుల్లా దివానా’ అన్నట్టుగా ఇక్కడి బీజేపీ నాయకులు తామేదో చేసినట్టు శుష్క ప్రచారానికి తెగబడటం వారి వెకిలి మకిలి మనస్తత్వానికి ప్రతీక.
నిజంగానే తెలంగాణ బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల బాగోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో ఒక్కటైనా రాష్ర్టానికి తేగలిగి ఉండేవారు. కేంద్రం దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే, అందులో ఒక్కటి కూడా తెలంగాణలో నెలకొల్పలేదు. ఉత్తమాటలు, చెత్త రాజకీయాలే తప్ప తెలంగాణ ప్రజలకు ఏమీ చేయటం చేతగాని స్థానిక బీజేపీ నాయకులు మాట్లాడకుండా ఉండి ఉన్నా ఇజ్జత్ దక్కేది. తమ ప్రమేయం లేని ప్రగతిని తమ ఖాతాలో వేసుకోవాలనుకునే వికృత ప్రయత్నం వల్ల, ఇంతకు మించి వాళ్లు ఇంకేమీ చేయరని, చేయలేరని ప్రజల ముందు తేలిపోయింది. పరువు పోగొట్టుకొని, ఫజీతు పాలవడం తప్ప, వీళ్లు సాధించినదేమీ లేదు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద తెలంగాణకు రావాల్సిన ఎయిమ్స్ను అడగంగ అడగంగ కేంద్రం ఏర్పాటు చేసింది. దాని గతి.. బస్తీ దవాఖానకు ఎక్కువ, ఏరియా ఆసుపత్రికి తక్కువ అన్నట్టు ఉంది. ఎయిమ్స్లో మెడికల్ విద్యార్థులు క్లినికల్ ప్రాక్టీస్ చేయలేని పరిస్థితులుంటే, రాష్ట్ర ప్రభుత్వమే పూనుకొని వారికి భువనగిరి దవాఖానలో అవకాశం ఇచ్చింది. ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒరగబెట్టిన ప్రయోజనం. ఎప్పుడో అయిపోయిన పెండ్లికి ఇపుడు బాజాలు కొట్టినట్లు, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఎయిమ్స్ను ఘనత వహించిన ప్రధానమంత్రిగారు నాలుగేండ్ల తర్వాత వచ్చి ప్రారంభించారు.
60 ఏండ్ల సమైక్య పాలనలో ఒక్కటంటే ఒక్క సూపర్ స్పెషాలిటీ దవాఖానను రాష్ట్రంలో నిర్మించలేదు. నిజాం కాలంలో నిర్మించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నీలోఫర్ దవాఖానాలే తెలంగాణ ప్రజల్ని ఆదుకున్నాయి. నియోజకవర్గ స్థాయిలో అత్యవసర సేవలు, ఐసీయూ వార్డులు, వైద్య పరికరాలు, డాక్టర్లు లేక ప్రజలు వందలాది కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్కు రావాల్సి వచ్చేది. సకాలంలో వైద్యం అందక మార్గమధ్యంలో మరణించిన సంఘటనలు కోకొల్లలు. మనుషుల ప్రాణాల విలువ తెలిసిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూ వార్డులను, ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి, ఎంతోమంది ప్రాణాలను పరిరక్షిస్తున్నది. గతంలో రాష్ట్రంలో మూడంటే మూడే డయాలసిస్ సెంటర్లు ఉండేవి. నేడు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 102 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, డయాలసిస్ పేషంట్లకు ఆసరా ఫింఛన్, ఉచిత బస్పాస్ను అందిస్తున్నది.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల దుష్పరిపాలన రోగగ్రస్థులైన వారిని శాపగ్రస్థులుగా కూడా మార్చింది. నేడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నది. వరంగల్ నగరంలో ఆరోగ్య కల్పతరువు వంటి హెల్త్సిటీని శరవేగంగా నిర్మిస్తున్నది. నిమ్స్ హాస్పిటల్లో సేవలను విస్తృతపరుస్తూ అదనంగా రెండు వేల పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయడం చారిత్రక సన్నివేశం. మొత్తంగా పది వేల సూపర్ స్పెషాలిటీ పడకలను సిద్ధం చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తూ పురోగమిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టికి, సంకల్ప సిద్ధికి ఇంతకు మించిన తార్కాణం ఇంకేం ఉంటుంది? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో వైద్యసేవల ముఖచిత్రమే మారిపోతుంది. రోగికి బెడ్ దొరకలేదు, వెంటిలేటర్ దొరకలేదు అనే పరిస్థితి ఏర్పడకుండా, ప్రభుత్వం వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నది.
దృష్టిలోపాలను తొలగించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేత్రవైద్యాన్ని ప్రజల ఇంటి ముందుకు తీసుకొచ్చారు. కంటి వెలుగు అనే పేరుతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2018లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా రెండు విడతల్లో 3 కోట్ల 10 లక్షల మందికిపైగా కంటి పరీక్షలు జరిపి, అవసరమైన వారికి తగిన చికిత్సను, కండ్లద్దాలను అందించింది ప్రభుత్వం. ప్రపంచంలోనే మరెక్కడా ఇంత పెద్దఎత్తున సామూహిక నేత్ర పరీక్షలు ఏ ప్రభుత్వమూ నిర్వహించలేదు.
తెలంగాణ ప్రభుత్వం ఇంత చేస్తుంటే, కళ్లు లేని కబోదుల్లాగా కాంగ్రెస్, బీజేపీ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారు. నీతి ఆయోగ్ ర్యాంకుల్లో బీజేపీ, కాంగ్రె స్ పాలిత రాష్ర్టాలు ఎక్కడున్నాయి.. అంటే అట్టడుగున ఉన్నాయి. అట్లాంటివాళ్లు తెలంగాణకు నీతులు చెబుతున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి లేదు.
నీతి ఆయోగ్ ర్యాంకులలో తెలంగాణ మూడో స్థానంలో ఉంటే, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ 16వ స్థానంలో, ఛత్తీస్గఢ్ 10వ స్థానంలో, హిమాచల్ప్రదేశ్ 7వ స్థానంలో ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కారుగా గొప్పలు చెప్పుకొనే ఉత్తర ప్రదేశ్ చిట్టచివరి స్థానంలో ఉన్నదనే సత్యాన్ని బీజేపీ నాయకులు తెలుసుకుంటే మంచిది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు తమకు ఎంతమాత్రం లేదనే సత్యం వారికి బోధపడుతుంది.
మానవ సంపదే మహోన్నత సంపద అనే భావనతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిరక్షణ పరమ కర్తవ్యంగా నిరంతరం పరిశ్రమిస్తున్నది. మానవీయ కోణమెరుగని ప్రతిపక్ష పార్టీలు ఓట్లు, సీట్లే పరమావధిగా అనారోగ్య రాజకీయాలకు పాల్పడుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి ఉషోదయాన్ని ఆరోగ్య భాగ్యోదయంగా మలిచేందుకు పునరంకితమవుతున్నది.
– వ్యాసకర్త: తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు