Ponnam Prabhakar | టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీసీఎస్, పీఎఫ్, ఇతర పెండింగ్ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. హైదరాబాద్లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్లో గురువారం గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్తో పాటు మేడారం జాతరలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులకు, దసరా లక్కీ డ్రా విజేతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్.. టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్తో కలిసి 157 మంది ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందజేసి వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కండక్టర్లు, డ్రైవర్లు టీఎస్ఆర్టీసీకి పునాదిలాంటి వారని అన్నారు. నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తోన్న సిబ్బందిని గుర్తించి అవార్డులను అందజేసి సన్మానించుకోవడం అభినందనీయమని అన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఇప్పటివరకు 24 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో అత్యుత్తమ విధులు నిర్వహిస్తోన్న మహిళా ఉద్యోగులకు అవార్డులు అందజేయాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్కు సూచించారు. సంస్థలో మహిళా డ్రైవర్లనూ నియమించుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. మహాలక్ష్మి స్కీం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని, అందుకు ప్రభుత్వ సహకారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. కొత్త బస్సులకు అనుగుణంగా సంస్థలో నియామకాలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. టీఎస్ఆర్టీసీ బాగుకోసం ఉద్యోగుల నుంచి సలహాలు, సూచనలను సంస్థ స్వీకరిస్తోందని చెప్పారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. మేడారం మహాజాతరలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అద్బుతంగా పనిచేశారని కొనియాడారు. మహాలక్ష్మి స్కీం అమలు తర్వాత సిబ్బందిపై కొంత పని ఒత్తిడి పెరిగిందని, ఒత్తిడిలోనూ ఓపికతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోన్న సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సిబ్బంది నిజాయతీతో ఉత్తమ సేవలందించడం వల్లే జాతీయస్థాయిలో సంస్థకు గుర్తింపు లభిస్తోందన్నారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2 వేల కొత్త బస్సుల కొనుగోలుకు సంస్థ ప్లాన్ చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సూచనల మేరకు మహాలక్ష్మి పథకం అమలులో అత్యుత్తమ విధులు నిర్వహిస్తోన్న మహిళా ఉద్యోగులకు అవార్డులు అందజేస్తామని, సంస్థలో మహిళా డ్రైవర్లనూ నియమించుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
మహాలక్ష్మి పథకం అమలుకు ముందు
ఫస్ట్ బెస్ట్ రీజియన్ కరీంనగర్, సెకండ్ బెస్ట్ రీజియన్ మహబూబ్నగర్, థర్డ్ బెస్ట్ రీజియన్ నిజామాబాద్.
మహాలక్ష్మి పథకం అమలు తర్వాత
ఫస్ట్ బెస్ట్ రీజియన్ హైదరాబాద్, సెకండ్ బెస్ట్ రీజియన్ సికింద్రాబాద్, థర్డ్ బెస్ట్ రీజియన్ వరంగల్.