హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): క్రైస్తవులకు క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం దుస్తులు పంపిణీ చేయనున్నదని, ఇందుకోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేయనున్నదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి చెప్పారు. గురువారం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని మీడియా పాయింట్లో మాట్లాడారు. త్వరలో ప్రభుత్వం మైనార్టీ స దస్సు నిర్వహించనున్నదని రామ్మోహన్రెడ్డి చెప్పారు. త్వరలో ధరణి లోపాలను గుర్తించి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు.
ఇబ్రహీంపట్నంలో నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీని మొదటి నుంచీ తాను వ్యతిరేకించానని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చెప్పారు. తమ మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఫార్మాసిటీ రద్దు చేసినందుకు రైతులు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల ప్రజల తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీనికోసం సేకరించిన భూములను స్థానిక పేద రైతులకు ఇస్తామని, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణ యం తీసుకుంటుందని చెప్పారు. ఫార్మాసిటీ స్థానంలో కాలుష్య రహిత కంపెనీలను ఆహ్వానిస్తామని, స్థానికులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు ఇచ్చేవారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలోనే దళితులకు సముచిత స్థానం దక్కుతున్నదని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు.