హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వేతన సవరణకు రెండో వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయడం పట్ల టీజీ వో, పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపాయి. మధ్యంతర భృతి (ఐఆర్) ఉత్తర్వులపై మాత్రం పునరాలోచించి 11శాతంగా నిర్ణయించాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు ప్రభుత్వాన్ని కోరారు.
ఉద్యోగులు, పెన్షనర్లు, టీచర్లకు ప్రకటించిన 5% ఐఆర్పై ప్రభుత్వం పునరాలోచించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) అధ్యక్షుడు వీ మమత, ప్రధానకార్యదర్శి సత్యనారాయణ కోరారు. ఐఆర్ను 5 నుంచి 10శాతానికి పెంచాలని విజ్ఞప్తిచేశారు.