TS Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తిలో 50 పడకల దవాఖానా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. గత నెల నాలుగో తేదీన పాలకుర్తిలో పర్యటించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్ రావు మాట్లాడుతూ.. పాలకుర్తి ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన పాలకుర్తి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ను 50 పడకల దవాఖాన ను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు హామీ ఇచ్చారు.
నాడు ఇచ్చిన హామీని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్ రావు గురువారం నిలుపుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ జీవో జారీ చేసింది. రూ. 17.50 కోట్ల నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభించాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా పాలకుర్తి ప్రజల కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు రుణపడి ఉంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తికి 50 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.