హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : తమ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇతరులకు వేలం వేసి అమ్మడంపై కోర్టుకెక్కిన ఎస్బీఐతో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్నది. రాయదుర్గంలో ఎస్బీఐకి చెందిన ఐదు ఎకరాల భూమిని తీసుకొన్న ప్రభు త్వం.. దీనికి రెండింతల భూమిని మరోచోట కేటాయిస్తామని ఎస్బీఐ అధికారులతో ప్రతిపాదించినట్టు తెలిసింది. రాయదుర్గం వంటి ప్రైమ్ ఏరియాల్లో అయితే భూమికి ప్రత్యామ్నాయంగా భూమి ఇస్తామని, ప్రైమ్ ఏరియాల్లో అయితే 5 ఎకరాలు, ఫ్యూచర్సిటీలో అయితే 15 ఎకరాల వరకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ అధికారులతో ప్రతిపాదించినట్టు సమాచారం.
ఈమేరకు టీజీఐఐసీ అధికారులు ఎస్బీఐ అధికారులకు భూముల వివరాలు అందజేశారు. బుధవారం హైదరాబాద్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చారు. భూముల కేటాయింపు పూర్తిచేసిన వెంటనే హైకోర్టులో కేసు ఉపసంహరించుకొంటున్నట్టు పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఎస్బీఐ అధికారులను కోరింది. ఎస్బీఐపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయని ఎస్బీఐ అధికారు లు అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వంలోని కొందరు చెప్పడంతోనే ఆయా మీడియా సంస్థల్లో ఈ తరహా వార్తలు వస్తున్నాయని వారు అభిప్రాయపడినట్టు సమాచారం.