గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ విషయమై రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేశ్ దత్ శనివారం ఆదేశాలు జారీ చేశారు.
వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీప వాగుల నుంచి ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది.
అవసరం ఉన్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అధికారులు అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మహేశ్ దత్ ఎక్కా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.