నల్లగొండ: పేదల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం నేరడుగొమ్ము మండలం కచరాజుపల్లి గ్రామానికి చెందిన 30మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. రైతులకు నిరంతరం కరెంట్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే నని పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు.
దశాబ్దాల భూవివాదాలకు తెరదించి భూయజమానులకు హక్కులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ధరణీ పోర్టల్ ను రూపొందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మహన్మ నాయక్, జడ్పీటీసీ కేతావత్ బాలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లోకసాని తిరపతయ్య, వైస్ ఎంపీపీ అరేకంటి రాములు, ఎంపీటీసీ వంకునవత్ బిక్కు నాయక్, సర్పంచ్ వంకునవత్ నాగు నాయక్ తదితరులు పాల్గొన్నారు.