తెలుగు యూనివర్సిటీ/మోహదీపట్నం, అక్టోబర్ 7: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, దాదాపు 25 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు రూ.20 కోట్లతో అన్ని రకాల వసతులతో రూపుదిద్దుకున్న నాంపల్లిలోని అత్యంత పురాతన అనీస్-ఉల్-గుర్బా అనాథ శరణాలయాన్ని శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం నాంపల్లి హజ్హౌస్లో నార్త్బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. 1921లో మీర్ఖాజా బద్రుద్దీన్ చిస్తీ నెలకొల్పిన ఈ అనాథ శరణాలయం 500 గజాల విస్తీర్ణంలో ఉండేదని, ప్రస్తుతం 4,500 చదరపు గజాలలో ఏడు అంతస్థుల్లో కొత్త భవన సముదాయాన్ని నిర్మించినట్టు తెలిపారు. ఇందులో 600 మంది పేద, అనాథ బాలలకు సరిపడేలా వసతులు కల్పించామని చెప్పారు. అనాథలకు వసతితోపాటు వృత్తి నైపుణ్య శిక్షణ, ఆరోగ్య సంరక్షణతోపాటు కేజీ నుంచి పీజీ విద్య అందించేందుకు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోనున్నట్టు వివరించారు. అనంతరం హజ్హౌస్ నార్త్బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 23 కోట్టు కేటాయించినట్టు వెల్లడించారు. మసీదుల్లో పనిచేసే 7 వేల మంది ఇమామ్లు, మౌజమ్లకు రూ.5 వేల భృతికి సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీచేశారు. ఇప్పటివరకు 10 వేలమందికి ఇచ్చామని, అదనంగా మరో ఏడు వేల మందికి కూడా మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎంఐఎం శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, హజ్ కమిటీ చైర్మన్ సలీం, మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, వక్బోర్డు చైర్మన్ మసీయుల్లాఖాన్, ఎమ్మెల్యే జాఫర్హుస్సేన్, మైనార్టీస్ సంక్షేమ శాఖ సెక్రటరీ జలీల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.