హైదరాబాద్ : తెలంగాణలో 41 కుల సంఘాల భవనాలకు స్థలాలను కేటాయిస్తూ నిర్మిస్తున్న ప్రభుత్వం తెలంగాణయేనని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. కోకాపేట లో యాదవ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులు యాదవ, కురుమ ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. గొల్ల, కురుమల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.గొల్ల, కురుమలు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు రాగానే కుల సంఘాల వారిని వాడుకుని వదిలివేసేవారని విమర్శించారు. బీఆర్ఎస్ అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు అన్ని కులాలు,వర్గాల వారికి సముచిత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
మేరు క్రికెట్ లీగ్ను ప్రారంభించిన మంత్రి..
నిజాం కాలేజీ గ్రౌండ్ లో మేరు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేరు క్రికెట్ లీగ్ ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.