హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): గవర్నర్, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలతో కూడినదే రాష్ట్ర ప్రభుత్వం. ఒకరకంగా చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించేది గవర్నరే. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అనే జారీ అవుతాయి. అటువంటి గవర్నర్ తన ప్రభుత్వంపై తానే విమర్శలు చేసుకున్న అరుదైన సందర్భం పార్లమెంట్ సాక్షిగా బుధవారం చోటు చేసుకొన్నది. అది చేసింది ఎవరో కాదు.. సాక్షాత్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై. ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం ముగిశాక మీడియా ముందు ఆమె చేసిన వ్యాఖ్యలతో రాజ్భవన్ను రాజకీయ రచ్చగా మార్చుతున్నట్టు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి, రాజ్భవన్కు మధ్య ఉండే లక్ష్మణ‘రేఖ’ను తమిళిసై దాటారని విశ్లేషిస్తున్నారు. ప్రధానితో భేటీలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్న ఆమె, సమావేశంలో ఏం జరిగిందో చెప్పకనే చెప్పారు. ఫ్రెండ్లీ గవర్నర్ను అని పదేపదే చెప్పే తమిళిసై ప్రభుత్వంతో గిల్లకజ్జాలు పెట్టుకొనేలా వ్యవహరించటం ఏమిటని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఆమె వ్యాఖ్యలు రాజ్యాంగ పరిరక్షకురాలిగా కాకుండా రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని అంటున్నారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగాన్ని పెట్టలేదని గవర్నర్ ఆరోపిస్తున్నారు. నిజానికి గవర్నర్ రాజ్యాంగపరమైన అంశాల్లో తప్ప పాలనా సంబంధ విషయాల్లో జోక్యం చేసుకోరు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రభుత్వమే అన్ని వ్యవహారాలు చూసుకొంటుంది. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించినా, జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున చేసే ప్రసంగమైనా దానిని క్యాబినెట్ ఆమోదించిన తర్వాతే చదవాలి. ఆ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపట్టబోయే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలే ఉంటాయి కాబట్టి ఈ పద్ధతిని రాజ్యాంగంలో పెట్టారు. కానీ ఈసారి రిపబ్లిక్ డే ప్రసంగాన్ని ప్రభుత్వానికి గవర్నర్ పంపించలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ ఆమోదం లేకుండా గవర్నర్ సొంత ప్రసంగం చదవటం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే చర్య అని రాజకీయ నిపుణులు అంటున్నారు. శాసనసభ ప్రొరోగ్ కాకపోవడం వల్ల గతంలో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు.
శాసన మండలి చైర్మన్ పదవి ఖాళీగా ఉండటంతో సభలో అత్యంత సీనియర్ అయిన ఎంఐఎం సభ్యుడు అమీనుల్ జాఫ్రీని చైర్మన్ ప్రొటెంగా నియమించాలని గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. దీనిపై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోలేదు. కొంత కాలం తర్వాత చైర్మన్ ప్రొటెం అవసరం లేకుండా నేరుగా చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని సలహా ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి శాసన వ్యవస్థ స్వతంత్రమైనది. స్పీకర్, చైర్మన్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో సభలే నిర్ణయం తీసుకొంటాయి. ఈ విషయంలో గవర్నర్ అనవసరంగా సలహా ఇచ్చారనే విమర్శలు వినిపించాయి. ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా పనిచేసే ఉద్దేశమే ఉంటే ఈ అంశంలో గవర్నర్ కొర్రీలు పెట్టడం ఎందుకని టీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తమిళిసై ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరించారని అభిప్రాయపడుతున్నాయి.
ఎమ్మెల్సీ పదవికి కౌశిక్రెడ్డిని సిఫారసు చేస్తూ ప్రభుత్వం పంపిన అభ్యర్ధిత్వాన్ని ఆమోదించటం, తిరస్కరించటం అనేది గవర్నర్ విచక్షణ. కానీ ఏ నిర్ణయమూ తీసుకోకుండా ప్రభుత్వ సిఫారసును తొకిపెట్టినట్టు కనిపించిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
గవర్నర్ తన పర్యటనల గురించి మొదట రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. అప్పుడు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఇటీవల గవర్నర్ తన పర్యటనల గురించి ముందస్తుగా ప్రభుత్వానికి తెలియజేయకుండానే వెళ్తున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందుకు మేడారం జాతర ఉదంతాన్ని అధికారులు ప్రస్తావిస్తున్నారు. మేడారం జాతరకు గవర్నర్ వెళ్లనున్నట్టు రాజ్భవన్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయగా, ప్రస్తుతం హెలికాప్టర్ అందుబాటులో లేదని చెప్పింది. ప్రభుత్వానికి సొంతంగా హెలికాప్టర్ లేదు. బయటి నుంచి అద్దెకు తీసుకోవాలి. ప్రభుత్వ వినతిని పట్టించుకోకుండా గవర్నర్ జాతరకు వెళ్లి ప్రొటోకాల్ పాటించడం లేదనడంలో అర్థం లేదన్నది అధికారుల వాదన.