హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తెలుగుగంగ, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పనులు చేపట్టకుండా వెంటనే నిలువరించాలని కృష్ణా రివ ర్ మేనేజ్మెంట్ బోర్డును డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం బోర్డుకు లేఖ రాశారు.
తెలుగుగంగ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు బేసిన్ అవతలికి తరలిపోతున్నాయ ని, దీంతో తెలంగాణ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నదని వెల్లడించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్యాకేజీ-2 పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవడం దారుణమని, వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. దీనిద్వారా కృష్ణా నీటిని బేసిన్ బయటకు ఏపీ మళ్లిస్తున్నదని, దీనిపై ఇప్పటికే అనేకమార్లు లేఖలు రాశామని కేఆర్ఎంబీకి గుర్తుచేశారు. దీనివల్ల తెలంగాణ మరింత నష్టపోవాల్సి వస్తుందని ఈఎన్సీ ఆ లేఖలో వివరించారు.