హైదరాబాద్, జనవరి 17(నమస్తే తెలంగాణ): పంట పెట్టుబడి సాయంగా మరో రూ.550.14 కోట్ల రైతుబంధు నిధులను మంగళవారం విడుదల చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను 1.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు 62.45 లక్షల మంది రైతులకు రూ.6351.22 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగసభ నవశకానికి నాంది పలకబోతున్నదని తెలిపారు. నాడు ప్రత్యేక తెలంగాణ కోసం, నేడు దేశం కోసం కేసీఆర్ ముందడుగు వేశారని తెలిపారు. తెలంగాణ మాదిరిగానే దేశమంతా వ్యవసాయరంగం సుభిక్షం కావాలన్నదే ఆయన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయ పథకాలు, సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలని భారత ప్రజలు ఆశిస్తున్నారని మంత్రి తెలిపారు.