హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): జొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులు పండించిన మొత్తం జొన్న పంటను మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో 198 జారీ చేసింది. 2022-23 యాసంగి సీజన్కు సంబంధించి 65,494 టన్నుల జొన్న (హైబ్రిడ్) పంటను కొనుగోలుచేయాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కొనుగోలు కోసం రూ.219.92 కోట్లను బ్యాంక్ గ్యారెంటీ కింద ఇచ్చింది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్ష మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మార్క్ఫెడ్ ఎండీని ఆదేశించింది. రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ రైతులకు ఎప్పుడూ కష్టం రానీయరని, రైతులను కంటికి రెప్పలా కాపాడుకునే మనసున్న నేత అని కొనియాడారు.