DSC Notification | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు మరో శుభవార్త చెప్పింది. రెండు రోజుల్లో 6,612 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ను జారీచేయబోతున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారుచేసి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ను జారీ చేస్తామని తెలిపారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, మరో 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని వెల్లడించారు. జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీచేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ను విడుదల చేశామని, ఈ పరీక్ష సెప్టెంబర్ 15న జరగనున్నదని పేర్కొన్నారు. ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదలకానున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో మొత్తంగా 1,22,386 టీచర్ పోస్టులుండగా, ప్రస్తుతం 1,03,343 టీచర్లు పనిచేస్తున్నారని సబితాఇంద్రారెడ్డి తెలిపారు. 1,947 స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, 2,162 టీచర్లకు పీఎస్ హెచ్ఎంగా, మరో 5,870 సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు స్కూల్ అసిస్టెంట్స్గా పదోన్నతులు కల్పించాల్సి ఉందని చెప్పారు. ఇవిపోనూ ఖాళీగా ఉన్న 6,612 పోస్టులను ప్రత్యక్షంగా భర్తీ చేస్తున్నట్టు తెలిపారు.
టీచర్ పోస్టులను ఈ సారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేస్తామని సబితాఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, అదనపు కలెక్టర్ వైస్ చైర్మన్గా, సంబంధిత డీఈవో సెక్రటరీగా, జిల్లా పరిషత్ సీఈవో సభ్యులుగా గల కమిటీ ఈ నియామకాలను చేపడుతుందని, ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్కడిక్కడ నోటిఫికేషన్ జారీచేస్తారని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2017లో టీఆర్టీ ద్వారా 8వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీచేయగా, మధ్యకాలంలోనూ టీచర్ పోస్టుల భర్తీ ఆగలేదు. ఈ కాలంలో పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందులో టీచర్ పోస్టులను ప్రాధాన్యతగా తీసుకొని భర్తీచేస్తూ వస్తున్నది.