హైదరాబాద్ : మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యఅభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఇవాళ మత్స్యకార సంఘాల ప్రతినిధులతో మంత్రి తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులపై దాడుల నియంత్రణకు, చేపల చెరువుల లూటీలు జరగకుండా అరికట్టేందుకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు 10 మంది మత్స్యకార ప్రతినిధులతో కమిటీని నియమిస్తూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు.
మత్స్యకారులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని గుర్తు చేశారు. రాష్ట్రంలో భారీగా మత్స్య సంపద పెరగడంతో మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడిందని చెప్పారు. దళారులకు చేపలు విక్రయించి నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్య సొసైటీల నుంచి మత్స్య ఫెడరేషన్ ద్వారా నేరుగా చేపల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. రాష్ట్రం నుంచి ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని మంత్రి తలసాని తెలిపారు.