హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన గూడెం, మోడికుంట ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు తుది అనుమతులు మంజూరయ్యాయి. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి పంకజ్కుమార్ నేతృత్వంలో శుక్రవారం ఢిల్లీలో కొనసాగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. దీనిపై తెలంగాణ ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. సమావేశానికి తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఆదిలాబాద్, ములుగు సీఈలు శ్రీనివాస్, విజయ్భాస్కర్ హాజరై ఈ ప్రాజెక్టుల ఆవశ్యకతను వివరించారు. దీంతో సంతృప్తి చెందిన టీఏసీ ఆ రెండు ప్రాజెక్టులకు తుది అనుమతులు ఇచ్చింది.
ఏడాదిన్నరలోగా 5 ప్రాజెక్టులకు అనుమతులు
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గోదావరిపై నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి తొలుత 6 డీపీఆర్లను అనుమతుల కోసం కేంద్రానికి సమర్పించింది. ఇటీవల సీతమ్మసాగర్, వార్ధ డీపీఆర్లను కూడా కేంద్రానికి అందజేసింది. మొత్తంగా 8 డీపీఆర్లను, పూర్తిస్థాయి నివేదికలను సెంట్రల్ వాటర్ కమిషన్తోపాటు, గోదావరి నదీయాజమాన్య మండలికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. వాటిలో ఇప్పటికే చిన్నకాళేశ్వరం, చనకా కొరటా, చౌటుపల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల పథకాలకు తుది అనుమతులు మంజూరయ్యాయి. తాజాగా గూడెం, మోడికుంట ప్రాజెక్టులకు సైతం టీఏసీ తుది అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఏడాదిన్నరలోగా మొత్తంగా 5 ప్రాజెక్టులకు తెలంగాణ అనుమతులు సాధించినట్టయింది. మిగిలిన మూడు ప్రాజెక్టుల్లో సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ డీపీఆర్ల పరిశీలనను సీడబ్ల్యూసీ పూర్తిచేయడంతో వచ్చే టీఏసీలో వాటికి కూడా అనుమతులు లభించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సీడబ్ల్యూసీలోని అన్ని డైరెక్టర్లలో వార్ధా ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలన కూడా కొనసాగుతున్నది.
ఫలించిన ఇంజినీర్ల కృషి
వాస్తవానికి గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల అనుమతుల మంజూరుకు అడ్డంకులేమీ లేకున్నా నీటి లభ్యతపై లోతుగా పరిశీలన జరపాల్సి ఉన్నదంటూ సీడబ్ల్యూసీ కాలయాపన చేస్తున్నది. అయినప్పటికీ గడువులోగా అనుమతులను సాధించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో అధికారులు విశేష కృషి చేశారు. ఢిల్లీలో ప్రత్యేకంగా అధికారులను సైతం నియమించి డీపీఆర్లను అనుమతుల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నరలోగానే 5 ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంతోపాటు, మరో 2 డీపీఆర్ల ప్రక్రియను తుదిదశకు
చేర్చగలిగింది.
గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు
గోదావరిలో 11.75 టీఎంసీలను వినియోగించుకుని 68,150 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1949లో ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిర్మాణం 1958లో పూర్తయింది. ఆ తర్వాత ఆ ప్రాజెక్టులో పూడిక చేరడంతో నీటి నిల్వసామర్థ్యం 7.60 టీఎంసీలకు, ప్రస్తుతం 4.69 టీఎంసీలకు తగ్గిపోవడంతో ఎడమ ప్రధాన కాలువ దిగువన ఉన్న 30 వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 3 టీఎంసీలను లిఫ్ట్ చేసి ఆయకట్టుకు నీరందించేందుకు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అక్కడి నుంచి లిఫ్ట్ చేసిన నీటిని 12 కి.మీ. మేర ప్రెషర్ మెయిన్స్ ద్వారా తరలించి కడెం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువలోకి 58.42 కి.మీ. వద్ద ఎత్తిపోస్తున్నారు. తద్వారా 30 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. ఈ పథకానికి తాజాగా టీఏసీ తుది అనుమతులు మంజూరు చేసింది.
మోడికుంట ప్రాజెక్టు
ములుగు జిల్లా వాజేడు మండలంలో మోడికుంటపై 2.25 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించి 21,349ఎకరాలకు నీరందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.500.26 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది. అందుకు సంబంధించిన డీపీఆర్కు కేంద్రం తుది అనుమతులు మంజూరు చేసింది.