హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : చేనేత రుణమాఫీ హామీపైనా కాంగ్రెస్ సర్కార్ తిరకాసు పెడుతున్నది. అసలుకే మాఫీ చేసి, మిత్తికి మంగళం పాడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చేనేత రుణమాఫీపై జరుగుతున్న కసరత్తులో ఈ విషయం బయటపడింది. దీంతో లక్ష లోపు రుణాలు పొందిన చేనేత కార్మికులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు రూ.ఒక లక్ష లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, బ్యాంకుల నుంచి పొందిన రుణంలో అసలు మాత్రమే మాఫీ చేయడానికి చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అసలుపై పెరిగిన వడ్డీని రుణగ్రహీత తిరిగి బ్యాంకులకు చెల్లిస్తేనే రుణం పొందిన అసలు సొమ్ము మాఫీ జరుగుతుందని అధికారులు తేల్చి చెప్తున్నారు. ఈ మేరకు ఆయా బ్యాంకులకు ఆదేశాలను జారీ చేస్తున్నారు.
బ్యాంకులు సైతం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లెక్కలు కడుతున్నారు. రూ.1 లక్ష లోపు రుణం పొందిన వారి లెక్కలు తీస్తున్నారు. వారి అర్హతల గురించి క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఉదా:ఒక చేనేత కార్మికుడు తన అవసరాల కోసం బ్యాంకు నుంచి రూ.90,000 రుణం తీసుకున్నారు. దానికి మిత్తి దాదాపు రూ.25,000 అయింది. అసలు, మిత్తి కలిపితే రూ.1.15 లక్షలు మొత్తం కార్మికుడు బ్యాంకుకు చెల్లించాలి. కానీ, ప్రభుత్వం ఇందులో తిరకాసు పెట్టింది. బ్యాంకు నుంచి పొందన రుణం రూ.90,000కే రుణమాఫీ జరుగుతుందని తేల్చింది. మిత్తి సొమ్ము రూ.25,000 ఆ చేనేత కార్మికుడే బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో రూ.1 లక్ష లోపు చేనేత రుణమాఫీ కోసం రూ.33 కోట్లు అవసరం అవుతాయని, 6,600 మంది కార్మికులు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రూ.33 కోట్లను కూడా ఎలా తగ్గించాలి? అన్న లెక్కలు వేస్తున్నట్టు అర్థమవుతున్నది. అందులో భాగంగానే రుణమాఫీలో అనేక ఆంక్షలు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అసలు, మిత్తి కలిపి మొత్తం సొమ్మును మాఫీ చేయాలని చేనేత కార్మిక సంఘం నాయకుడు చెరుకు స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని హెచ్చరిస్తున్నారు.