Kaleshwaram | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరో మహాయజ్ఞం చకచకా పూర్తవుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరాన్ని తలపిస్తూ మరో మహా కాళేశ్వరం సిద్ధమవుతున్నది. అదే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. సొరంగాలు, సర్జ్పూల్స్, రిజర్వాయర్లు, భారీ పంపులు, వందల మెగావాట్ల సామర్థ్యంగల సబ్స్టేషన్లు.. ఇలా ఒకటా రెండా! అనేక ప్రత్యేకతలతో ఈ ప్రాజెక్టు శరవేగంగా సాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం డ్రైరన్ను త్వరలోనే నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఏదుల, వట్టెంలోని పంప్హౌస్లలో డ్రైరన్ను నిర్వహించారు. తాజాగా, ప్రాజెక్టులోని మొదటి పంప్హౌస్ నార్లాపూర్లోని పంపులను సైతం డ్రైరన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నార్లాపూర్లోని పంప్హౌస్తోపాటు సర్జ్పూల్, 400 కేవీ సబ్స్టేషన్లు ఇటీవలే పూర్తయ్యాయి. 145 మెగావాట్ల సామర్థ్యమున్న పంపుల అమరిక సైతం పూర్తయింది. ఇటీవలే సబ్స్టేషన్ రీచార్జిని కూడా ప్రారంభించారు. మరోవైపు మోటర్లకు సంబంధించిన ఎస్ఎఫ్సీ ప్యాన ల్స్, ఇతర ఎలక్ట్రో మెకానిక్ భాగాల పనితీరును సైతం పరీక్షించారు. ప్రస్తుతం మోటర్ల పనితీరును పరీక్షించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే డ్రైరన్ను నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చేనెల రెండో వారం నాటికి వెట్న్న్రు నిర్వహించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. కాగా, కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోనూ కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పలు ప్రత్యేకతలున్నాయి.
పథకం ప్రత్యేకతలు
కృష్ణా బేసిన్లో తొలి భారీ లిఫ్ట్
మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉన్నాయి. కృష్ణానది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గుండా 300 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నది. వ్యవసాయోగ్యమైన భూములు నది సాధారణ ప్రవాహ స్థాయికి 270 మీటర్ల నుంచి 660 మీటర్ల ఎత్తున ఉంటాయి. ఈ నేపథ్యంలో లిఫ్ట్లు ఏర్పాటుచేసి తాగు, సాగునీటిని అందించడం అనివార్యంగా మారింది. ఉమ్మడిరాష్ట్రంలో ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఎప్పటికప్పుడు స్థానిక రైతుల డిమాండ్ మేరకు వాగులు, చెరువుల మీద చిన్నచిన్న ఐడీసీ లిఫ్ట్లను ఏర్పాటుచేసి, వానకాలంలో వరదను ఎత్తిపోసి 5 నుంచి 10 వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించేవారు. ఆ లిఫ్ట్లకయ్యే కరెంటు చార్జీల భారాన్ని కూడా రైతులపైనే మోపారు.
రాష్ట్రంలో మొత్తం ఐడీసీ లిఫ్ట్స్కీమ్లు 640 ఉండగా, అందులో అత్యధిక లిఫ్ట్లు ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నాయి. అందులో ఆయకట్టుపరంగా పాలమూరుది అగ్రస్థానం. తెలంగాణ ఉద్యమ సమయంలో లిఫ్ట్లు ఏర్పాటుచేయాలనే డిమాండ్ రావడంతో ఉమ్మడి పాలకులు తూతూమంత్రంగా పలు లిఫ్ట్లను ప్రకటించినప్పటికీ, వాటి సామర్థ్యం అతి స్వల్పమే. రాష్ట్ర ఏర్పాటు వరకూ ఆయా ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. కృష్ణాబేసిన్లో ఇప్పటివరకు ఉన్న అన్ని లిఫ్ట్స్కీమ్ల సామర్థ్యం అర టీఎంసీ కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే అత్యధిక నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ కానున్నది. అత్యధికంగా 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించే పథకమూ ఇదే కావడం మరో విశేషం.