హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛసర్వేక్షణ్ 2.0 పేరుతో ప్రకటించిన తాజా అవార్డుల్లో రాష్ట్రంలోని ఏడు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి. ఈ మేరకు స్వచ్ఛభారత్ మిషన్ డైరెక్టర్ రూపా మిశ్రా అవార్డుల జాబితాను విడుదల చేశారు. జాతీయ స్థాయిలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న నగరాల విభాగంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అవార్డును కైవసం చేసుకున్నది. జాతీయస్థాయిలో జీడబ్ల్యూ ఎంసీ మూడోస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సరేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మెరుపువేగంతో దూసుకుపోతున్నది. ఇప్పటికే దక్షిణభారత దేశంలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది.
మున్సిపాలిటీల సంఖ్యాపరంగా అవార్డులు గెలుచుకున్న రాష్ట్రంగా దేశంలో రెండో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి పారిశుద్ధ్య నిర్వహణలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా గత అక్టోబర్లో 16 అవార్డులు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా అత్యంత వేగంగా పురోగమిస్తున్న క్యాటగిరీల్లో మరో 7 మున్సిపాలిటీలు అవార్డులను కైవసం చేసుకున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు జాతీయ కేటగిరీలో అత్యంత వేగంగా పురోగమించే నగరంగా 3వ స్థానంలో నిలవడం విశేషం.