బాన్సువాడ: అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణలో ప్రగతి సాధ్యమైందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున ‘తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం’ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ పరిధిలోని కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన శ్యామకూర శంకర్ (సోమేశ్వరం గ్రామం), హరిబాబు (కొత్తాబాది గ్రామం) కుటుంబసభ్యులను సభాపతి సన్మానించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ప్రగతి అన్నారు. ఎంతో మంది పోరాటం, బలిదానాలతో వచ్చిన తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా రాలేదు. దశాబ్దాల పోరాటం, వందలాది మంది యువత బలిదానాలతో ఏర్పడింది. 1969లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేను లాఠీ దెబ్బలు తిన్నా. అప్పుడు ఆంధ్రా పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి కఠినంగా వ్యవహరించారు. ఆంధ్రా ప్రాంతం నుంచి పోలీసులను రప్పించారు. ఆనాటి కాల్పుల్లో 369 మంది యువకులు చనిపోయారు. నేనప్పుడు హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంక్ దగ్గరగల నాగార్జున ఇంజినీరింగ్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్నా. మా కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులం ఆందోళన చేస్తుంటే పోలీసు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో నా పక్కన నిలబడిన సహ విద్యార్థి చనిపోయాడు. నాతో సహా ఆరుగురిని పోలీసులు స్టేషన్లో వేసి, బట్టలు విప్పి ఎనిమిది రోజులు కొట్టారు. అంతా ఆంధ్రా పోలీసులే. పాచి పోయిన తిండి పెట్టారు. బూతులు తిట్టారు. ఇంకా కొడితే చచ్చిపోతామని ఎనిమిది రోజుల తర్వాత నడవలేని పరిస్థితిలో ఉన్న మమ్మల్ని రోడ్డు మీదకు తోశారు’ అని పోచారం చెప్పారు.
‘ఒళ్లంతా నొప్పులతో, ఆకలితో దిక్కుతోచక తెలిసిన వారి సహాయంతో ఊరికి చేరుకున్నాం. ఆనాటి ఆంధ్రా పాలకులు అంత కఠినంగా వ్యవహరించారు. అయినా ఉద్యమం కొనసాగింది. ఉద్యమానికి మద్దతుగా ఇంజినీరింగ్ చదువు మద్యలోనే వదిలేసి ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకున్నా. నాడు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో మర్రి చెన్నారెడ్డి లాలూచీపడి నాటి ప్రధాని ఇందిరాగాంధీకి లొంగిపోయాడు. ఆయన పెట్టిన తెలంగాణ ప్రజా సమితి పార్టీ తరఫున గెలిచిన 11 మంది ఎంపీలు కూడా పార్టీ మారారు. అంతటితో తెలంగాణ తొలి ఉద్యమం ఆగిపోయింది. తిరిగి 2001లో కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం మొదలైంది. బషీర్ బాగ్ కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయిన తరువాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమం వైపు మళ్లారు. నేడు అమరవీరుల స్మారకం నిర్మించిన ప్రదేశంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీకి చెందిన జలదృశ్యంలో కొంతమంది పెద్దలతో సమావేశం జరిపిన కేసీఆర్ మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు’ స్పీకర్ తెలిపారు.
‘ఉద్యమంలో భాగంగా 2009లో అమరణ నిరాహారదీక్ష చేస్తున్న కేసీఆర్ చనిపోతాడని సమాచారం ఢిల్లీకి చేరింది. ఆ భయంతో తెలంగాణ ఇస్తామని సోనియాగాంధీ ప్రకటించారు. మళ్ళీ మాట వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంలోనే విద్యార్థులు నిరాశతో ఆత్మ బలిదానాలు చేసుకోవడం మొదలైంది. తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేకపోయా. తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నా. 2011లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశా. మీ అందరి మద్దతు, ఆశీర్వాదంతో ఉప ఎన్నికల్లో TRS పార్టీ నుంచి యాబై వేల ఓట్ల మెజారిటీతో గెలిచా. ఇప్పుడు హైదరాబాద్లో రూ. 150 కోట్లతో అమరవీరుల స్మారకం నిర్మించారు. ఈ రోజు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. హైదరాబాద్కు వచ్చే దేశ, విదేశాలకు చెందిన వారు అమరవీరుల స్మారకాన్ని సందర్శించి వారి త్యాగాల గురించి తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు’ అని పోచారం పేర్కొన్నారు.
‘సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారు. ప్రభుత్వ పథకాలలో కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారు. ఒక్క బాన్సువాడ మండలంలోనే 2,728 ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించామని చెప్పి దోచుకుతిన్నారు. నాటి పాలకులు నిర్మించామని కాగితాల మీద రాసుకున్న ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడా లేవు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేం కడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళు అందరికీ అగుపడుతున్నాయి. వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాదించింది. ధాన్యం ఉత్పత్తి 36 లక్షల టన్నుల నుండి 3 కోట్ల టన్నులకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే ఈ అభివృద్ధి సాద్యపడింది. అమరుల త్యాగాలను స్మరించుకుని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్గా ఉంచాలి. తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. అప్పుడే అమరుల ఆత్మ శాంతిస్తుంది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు డి అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.