Alampur | అలంపూర్ : రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠం అలంపూర్ క్షేత్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాలను జరిపారు.
ఇందులో భాగంగా శుక్రవారం ఆలయాలను పూల, మామిడి తోరణాలతో సుందరంగా ముస్తాబు చేశారు. జోగుళాంబ ఆలయ రాజగోపురం ముందు భాగంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. మంగళవాయిద్యాల మధ్య వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రోక్తంగా వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఆలయ పాలక మండలి చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు, ధర్మకర్తలు, ఈవో పురేందర్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు బాగా కురిసి పసిడి పంటలు పండాలని, సీఎం కేసీఆర్ బాగుండాలని అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. 21 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.