హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే మైనార్టీ వర్గానికి చెందిన పోలీసు అధికారి స్టీఫెన్ రవీంద్రపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మైనార్టీ అధికారులపై రేవంత్ విషం చిమ్ముతున్నారని, ఇది రేవంత్కే పరిమితమా? లేక కాంగ్రెస్ విధానమే ఇదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేయడం లేదని విమర్శించారు. అసలు స్టీఫెన్ రవీంద్ర అనే అధికారికి ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి మచ్చ లేదని తెలిపారు. 2005లో అగ్నిప్రమాదంలో చికుకున్న 61 మందిని కాపాడడంతో ఆయనకు శౌర్య పతకం, 2011 ప్రధాన మంత్రి లైఫ్ సేవింగ్ పతకం కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. రేవంత్ ఇకనైనా కులహంకార బుద్ధి మార్చుకోవాలని, లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.