సీఎం మానవతావాది మానవీయతతో ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, అప్రమత్తంగా ఉద్యోగాలు చేసుకోవాలి. కూలీలకు మరింత సమాచారమిస్తూ ఉపాధి హామీ పనులను వేగంగా చేయించాలి.
-ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్శాఖ మంత్రి
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొన్నది. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో 7,651 మంది విధుల్లో చేరబోతున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకొన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలియజేశారు. పలు చోట్ల వారి చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు జరిపారు.
2007లో 7,561 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకొన్నది. అప్పట్లో వారికి రూ.1200 జీతం ఇచ్చేవారు. కొద్ది నెలల్లోనే రూ.10 వేలకు వేతనాన్ని పెంచారు. జాబ్ కార్డులు ఉన్న వాళ్లలో సాధ్యమైనంత ఎక్కువమందిని ఉపాధికి వచ్చే విధంగా చూడాలని, విధుల్లో తప్పనిసరిగా ఉండాలని ఆదేశించడంతో.. ఫీల్డ్ అసిస్టెంట్లు తమను పర్మినెంట్ చేయాలని, జీతాలు ఎస్టీవోలనుంచి ఇవ్వాలని డిమాండ్లతో సమ్మెకు వెళ్లారు. కరోనా లాక్డౌన్ విధించిన 2020 మార్చి 18 నుంచి వారు పనుల్లోకి రాలేదు. 28 నెలలుగా వారు విధుల్లో లేరు. తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని విన్నవించుకొన్నారు. మంత్రి ఎర్రబెల్లి వారి విన్నపాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, మానవీయ కోణంలో ఆలోచించిన సీఎం వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వెలుగులు నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. రాబోయే రోజుల్లో పొరపాట్లు జరగకుండా సీఎం లక్ష్యాలు, ఆశయాలకు తగ్గట్టు పనిచేస్తాం.
– కంకల సిద్దిరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని స్వాగతిస్తున్నాం. సీఎం, మంత్రికి కృతజ్ఞతలు
-ఏ మహేశ్, అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం