కోల్కతా : బీజేపీపాలిత రాష్ట్రాలకు చెందిన సాయుధ దళాలను బెంగాల్లో వినియోగించరాదని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)కి విజ్ఞప్తి చేసింది. బీజేపీ నేత సువేందు అధికారి ప్రోద్బలంతో రాష్ట్రంలో తిష్ట వేసిన రాష్ట్రేతర నేరగాళ్లను అరెస్ట్ చేయాలని సీఈఓను కోరింది. తూర్పు మిడ్నపూర్ జిల్లాలో సంఘ విద్రోహ శక్తులను ముందస్తు కస్టడీలోకి తీసుకుని ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలని ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన తృణమూల్ నేతలు ఆయనను కోరారు.
ఇక ఏప్రిల్ 1న రెండో దశలో భాగంగా ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేంధు అధికారి బరిలో ఉన్న నందిగ్రామ్ ఉండటం ఉత్కంఠ రేపుతోంది. సువేందు అధికారి నందిగ్రామ్లో దీదీని దెబ్బతీసేందుకు కుయుక్తులకు తెరలేపారని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. స్దానికేతరులను పెద్ద సంఖ్యలో నందిగ్రామ్కు రప్పించారని వీరిని గుర్తించి అరెస్ట్ చేయాలని తృణమూల్ ప్రతినిధి బృందం ఈసీని కోరింది.