బంజారాహిల్స్, అక్టోబర్ 6: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన బీఆర్ఎస్ జాతీయ పార్టీకి వెల్లువలా మద్దతు లభిస్తున్నది. బీఆర్ఎస్పై కొంతకాలంగా తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఏపీలోని గుంటూ రు జిల్లా అచ్చంపేటకు చెందిన రైతు మోహన్రావు బీఆర్ఎస్ ప్రకటన సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిసేందుకు తెలంగాణభవన్కు వచ్చారు. చాలాకాలంగా తాను కేసీఆర్ అభిమానినని, రైతుల కోసం చేస్తున్న మంచి పనులను టీవీలో చూస్తుంటానని మోహన్రావు తెలిపారు. బీఆర్ఎస్కు చక్కటి భవిష్యత్తు ఉన్నదని, కేసీఆర్ ప్రధాని అవుతారని చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని తెలిసి ఆయనకు చిరు బహుమతి అందించాలని ఇక్కడకు వచ్చినట్టు పేర్కొన్నారు. సీసాలో చిన్నచిన్న కర్రలు, దారాలు, కారు గుర్తు, కుర్చీ నమూనాను ఆయన చూపించారు.
కేసీఆర్ వెంట ప్రతి ఒక్కరూ నడవాలి
తెలంగాణ సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించారు. దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని బలోపేతం చేయాలనే అలోచనతోపాటు వెనుకబాటుతనాన్ని రూపుమాపి అనేక ప్రాంతాలను, జాతులను సంక్షేమం దిశగా నడిపేందుకు ఆయన నడుం బిగించారు. పక్కా ప్రణాళికతో ముందు కు వెళ్తున్న కేసీఆర్ వెంట ప్రతి ఒక్కరూ నడవాలి.
– పెద్ది సుదర్శన్రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే
సంక్షోభ కాలంలో సంఘటితం కావాలి
దేశంలో మతోన్మాదశక్తుల కారణంగా సంక్షోభం ఏర్పడింది. దేశ ప్రజలు జాతీయోద్యమ స్ఫూర్తితో కేసీఆర్ నూతన ఆలోచనలకు, బీఆర్ఎప్ పార్టీకి స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది. సంక్షోభ కాలంలో సంఘటితం కావాలి. సంక్షోభంలో చిక్కుకొనిపోతున్న వ్యవస్థను గట్టెక్కించాలంటే కేసీఆర్ లాంటి నాయకుడితోనే సాధ్యం. జాతిని చీల్చి చిచ్చుపెట్టే దుర్మార్గులను ఎదుర్కోవాలంటే ఇదే సరైన సమయం.
– నాలేశ్వరం శంకరం, ప్రముఖ రచయిత
కోతల ప్రభుత్వానికి వాతలు పెట్టాలె
నిరుపేదలకు, వెనుకబడిన వర్గాలకు నిజమైన లబ్ధి చేకూరాలంటే.. ఇప్పుడు కేంద్రంలో ఉన్న కోతల ప్రభుత్వానికి వాతలు పెట్టి.. చేతల ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. ఎప్పటినుంచో లౌకికవాదాన్ని మోసుకొస్తున్న సీఎం కేసీఆర్ అదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. తెలుగుజాతి చరిత్రలో ఏ నాయకుడూ జాతీయ స్థాయి పార్టీని పెట్టిన దాఖలాలు లేవు. ఇంట గెలిచిన కేసీఆర్.. రచ్చ గెలిచి బీఆర్ఎస్ ద్వారా ఎర్రకోటపై జెండా ఎగురేసే సమయం ఎంతో దూరంలో లేదు.
– డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, ప్రముఖ రచయిత
కేసీఆర్ ప్రకంపనలు సృష్టిస్తారు
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నిర్ణయాలు ప్రకంపనలు సృష్టిస్తాయి. ఆయన నిర్ణయం ఎంతో విజన్తో కూడుకున్నది. ప్రస్తు తం కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేదు. ఇది ఆందోళనకరం. ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ప్రజాస్వామ్య పరిరక్షణ, అభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ గొప్ప విజయాలను సాధించాలని కోరుకుంటున్నా.
– సునీతాకృష్ణన్, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు
కేసీఆర్ నాయకత్వం తప్పనిసరి
అతితక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ నాయకత్వం దేశానికి అనివార్యం. తెలంగాణ అమలు చేస్తున్న పారిశ్రామిక, రైతు అనుకూల విధానాలను దేశం ఎంతో ఆసక్తిగా చూస్తున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తెలంగాణ పారిశ్రామికవేత్తల తరఫున స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్తో నూతన ఒరవడితో దేశం ముందుకు సాగుతుంది.
– సుధీర్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం
ప్రత్యామ్నాయ శక్తిగా కేసీఆర్
అన్ని రంగాలను ప్రైవేట్పరం చేస్తున్న బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొని ప్రత్యామ్నాయ శక్తిగా సీఎం కేసీఆర్ అవతరిస్తానడంలో సందేహం లేదు. మత కల్లోలాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకొంటున్న బీజేపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ లాంటి నేత అవసరం. ఇందుకు కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వేదిక అవుతుంది.
– గండ్ర మోహన్రావు, హైకోర్టు సీనియర్ న్యాయవాది,
బార్ కౌన్సిల్ సభ్యుడు
బడుగు, బలహీన వర్గాలకు ఆశాకిరణం
కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. బడుగు, బలహీన వర్గాలకు ఆశాకిరణం. దేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా చేసే పట్టుదల ఉన్న నేత. ఆయన విధానాలతో దేశం సస్యశ్యామలం అవుతుంది. బీసీలకు చట్టసభల్లో కూడా సమన్యాయం జరుగుతుంది. కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
– చలకాని వెంకట్యాదవ్, తెలంగాణ విద్యావంతుల
వేదిక రాష్ట్ర కన్వీనర్, బార్ కౌన్సిల్ సభ్యుడు