హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/మానకొండూర్ రూరల్: తెలంగాణ రైతులకు అరుదైన గౌరవం దక్కింది. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసినందుకుగానూ రాష్ర్టానికి చెందిన నలుగురు రైతులకు ఈ నెల 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం అందింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రైతు, ప్రగతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ సంద మహేందర్ దంపతులకు, ఆదిలాబాద్ జిల్లా గుండాలకు చెందిన రైతు, భూ సంపద రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ జూన గణపతిరావు, కమల దంపతులకు, హైదరాబాద్కు చెందిన కేంద్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జనార్దన్ గంగపుత్ర, రమశ్రీ దంపతులకు, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పాకాల పురుషోత్తంరెడ్డి, పద్మజ దంపతులకు ప్రత్యేక అహ్వానం అందింది.
ఎర్రకోటలో జెండా ఆవిష్కణను తిలకించేందుకు ఎస్ఎఫ్ఏసీ, భారత ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాన్ని శుక్రవారం అందజేసినట్టు పురుషోత్తంరెడ్డి దంపతులు తెలిపారు. జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం ఎన్సీడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు ఉత్పత్తి సహకార సంఘం, పాల ఉత్పత్తి సహకార సంఘం అధ్యక్షుడిగా తాను సేవలందించినందుకు ఈ ఆహ్వానం అందినట్టు పురుషోత్తంరెడ్డి చెప్పారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్పీవో)జాతీయ స్థాయి సమావేశాన్ని ఢిల్లీలో గత జూలైలో నిర్వహించగా ఆయన పాల్గొన్నారు.