Farmers | నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్ : ‘మేం అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం’.. ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పేది ఇదే. కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. తామొస్తే రాష్ర్టాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తామని ప్రచారం చేసుకుంటున్నది. 24 గంటల ఉచిత కరెంటు స్థానంలో మూడు గంటల కరెంటిస్తామని, మంచిగున్న ధరణిని ఎత్తేసి ఏండ్లనాటి పట్వారీ వ్యవస్థ తెస్తామని చెప్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. మంచిగ ఉన్నదాన్ని తీసుడెందుకో, కొత్తదాన్ని పెట్టుడెందుకో అర్థంకాక రైతులు తలలు పట్టుకున్నారు. మీరొద్దు.. మీ పాలనొద్దంటూ ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. ‘మా తెరువుకొస్తే బుద్ధి చెప్తాం’ అని హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడా చికాకులేవీ లేవు
కేసీఆర్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చినంకనే రైతులకు బాగున్నది. చేతి రాత, మీ సేవా పహాణీలు ఉన్నప్పుడు ఎప్పడూ మా భూమి ఎవరి పేరు మీదికి పొయ్యేదో తెలిసేటిది కాదు. లోన్ కోసమో, భూమి అమ్మినప్పుడో తప్ప మా పేరున భూమి ఉన్నదో లేదో తెలిసేది కాదు. ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఫోన్లో కూడా మా భూ రికార్డులను చూసుకుంటున్నాం.
బ్యాంకుకు వెళ్లినా, వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లినా కంప్యూటర్లో చూసి క్షణాల్లో పని అయిపోతున్నది. పట్టాదారు, అనుభవదారు, హక్కుదారు విషయంలో ఏ గందరగోళం లేదు. ఇదివరకు అయితే రెవెన్యూ అధికారులు ఇక్కడ నీ పేరు లేదు.. అక్కడ నీ పేరు లేదు.. అని నానా చికాకు పెట్టేటోళ్ల్లు. ఇపుడు అవేమీ లేవు. ధరణి వచ్చినంక రైతులకు చాలా మేలు జరిగింది.
– వల్లభనేని ప్రభాకర్రావు, రైతు, ముత్తారం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా
కాంగ్రెస్కు బుద్ధి చెప్పాల్సిందే
కాంగ్రెస్ పార్టీ రైతులకు మూడు గంటల కరెంటు చాలంటాంది. ఎవుసానికి 3 గంటల కరెంటు ఎట్లా సరిపోతది? ఎంత పారకం పారుతుందో ఎవుసం చేస్తే తెలుస్తది. అది చేయనోడు ఏదో మాటలు చెప్తే ఎవలు నమ్ముతరు. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంల ఉన్నప్పుడు కరెంటు కష్టాలతో రైతులు గోసపడ్డరు.
ఎంతోమంది రాత్రి పూట బావులకాడికి పోయి ప్రమాదాలతో సచ్చిపోయిండ్రు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటిస్తున్నది. మూడు పంటలు పండించుకుంటున్నం. ఏ టైముకు పోయినా బాయికాడికి పోయి మోటర్లు వేసుకుని పారిచ్చుకుంటున్నం. రైతుల కోసం ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్కు రైతులు ఎప్పుడూ రుణపడి ఉంటరు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటం.
– చల్లా అనిల్కుమార్ రైతు, నార్లవాయి, సంగెం, వరంగల్
రైతులు బాగుపడడం కాంగ్రెసోళ్లకు నచ్చదు
రైతులు బాగుపడడం కాంగ్రెసోళ్లకు నచ్చదు. రైతులకు మేలు చేసే ఏ పనినైనా వ్యతిరేకంచడం ఆ పార్టీ నాయకులకు అలవాటైంది. ధరణితో మా రైతుల భూములకు భద్రత పెరిగింది. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా దళారులదే రాజ్యం.
గతంలో భూముల రిజిస్ట్రేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేటోళ్లం. పట్వారీలకు చేతులు తడపాల్సి వచ్చేది. అయినప్పటికీ సమయానికి రిజిస్ట్రేషన్ కాకపోయేది. భూముల విషయంలో రైతుల మధ్య గొడవలయ్యేవి. వీటన్నింటికి ధరణితో ఫుల్స్టాప్ పడింది. ఇప్పుడిది తీసేస్తే రైతుల భూములకు భద్రత ఉండదు. రైతులు సంతోషంగా బతికితే కాంగ్రెసోళ్లకు కడపుమంట. ధరణితో మా సమస్యలు తీర్చిన సీఎం కేసీఆర్కే అండగా ఉంటాం.
– మాడ బ్రహ్మారెడ్డి, రైతు, కాశీంపల్లి, జయశంకర్ భూపాలపల్లి
రైతులను నట్టేట ముంచే కుట్రలు
నేను 20 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. కాంగ్రెస్ హయాంలో కరెంట్ సక్కగా లేక నాకున్న పదెకరాల్లో కొంత నాటేసి, మిగతాది చెలక కింద ఇడిసిపెట్టేటోన్ని. కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడి సాయం, నీళ్లు, కరెంటు ఇస్తుండడంతో నాకున్న పదెకరాలతో పాటు ఇంకా 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యసాయం చేస్తున్న.
ఇప్పుడు కాంగ్రెస్ సరారొస్తే మూడు గంటలు కరెంట్ ఇస్తమంటున్నరు. కరెంట్ పోతే నీళ్లు ఎట్లపారాలి. గతంలో కరెంట్ లేక ఎంత కష్టపడ్డామో.. ఇప్పుడు అంత ఈజీగా నీళ్లు పెట్టి పంటలు పండిస్తున్నం. సీఎం
కేసీఆర్ వచ్చిన ఈ పదేండ్లలో కరెంట్ కోసం తిప్పలు పడలేదు. రైతులను నట్టేట ముంచేందుకే కాంగ్రెసోళ్లు కుట్రలు చేస్తున్నరు. రైతులకు లాభం చేసే పనులు చేయాలే కానీ, ముప్పేట ముంచే ఆలోచనలు మానుకోవాలి.
-కళ్లెం లక్ష్మారెడ్డి, రైతు, చొప్పదండి, కరీంనగర్ జిల్లా
మళ్లీ పాతకథ మొదటికొస్తుంది
కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే పాతకథ మొదటికొస్తుంది. మూడు గంటల కరెంటు వ్యవసాయానికి ఎట్ల సరిపోతుంది? హామీలు ఇవ్వడం తప్ప మంచి చెయ్యడం కాంగ్రెసోళ్లకు చేతగాదు. 10 అప్సర్ల మోటర్లతో గంటన్నరలోపు బావిలో నీళ్లు ఖాళీ అయిపోతాయి.
రైతులందరూ ఒకేసారి పారకం పెడ్తే మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. రైతు బాధలు తెల్సినోళ్లు ఇలాంటి మాటలు చెప్పరు. కేసీఆర్ వచ్చినంకనే మాలాంటి రైతులకు మంచిగున్నది. 24 గంటల కరెంటు, రైతుబంధుతో మా పరిస్థితి మారింది. రైతులు మంచిగుండాలంటే మళ్లీ కేసీఆరే రావాలి.
– పొట్టి చంద్రారెడ్డి, రైతు, మాందాపూర్, సంగారెడ్డి జిల్లా
గా పాలనతో గిన్ని వడ్లు పండినయా?
కాంగ్రెసోళ్ల మాటలతో రైతులంతా ఆగమైతున్నరు. 3 గంటల కరెంట్ చాలని, బోరు బావులకు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకొమ్మని ఇట్లా ఏదేదో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. గిప్పుడు గింత లొల్లి చేత్తున్నరు.
వాళ్లు గెలిస్తే రైతాంగం ఆగమే అని అర్థమైతంది. ఏండ్ల కామాన ఏలిర్రు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండే. ఆ పాలనలో గిన్ని వడ్లు పండినయా? కరెంట్ వత్తుండెనా? ఆ బాధలు రైతులకెరుకే. రైతులకు నీళ్లు, కరెంట్ పుష్కలంగా ఉండడంతో వడ్లు పుట్లకొద్దీ పండిస్తున్నరు. బర్లను సాదుకుంటున్నరు. కూరగాయలు పండించుకుంటున్నరు. ఇంత సక్కగా ఎవుసం సాగుతుంటే కాంగ్రెసోళ్లు కాళ్లళ్ల్ల కట్టె పెట్టే మాటలు మాట్లాడుతున్నరు. ఎవలేం చెప్పినా వినం. మా ఎవుసం మంచిగ సాగేలా చేస్తున్న కేసీఆర్ను మరువం.
– బోండ్ల ఎల్లయ్య, రైతు, లింగారెడ్డిపల్లి, సిద్దిపేట జిల్లా
ధరణి రద్దు చేస్తామంటే ఊరుకోం
మాకు ఊళ్లో పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. కాంగ్రెసోళ్లవి అన్నీ దళారీ మాటలే. వాళ్లు ఎప్పుడూ దళారులను బతికించాలనే చూస్తరు. రైతుల గోస వాళ్లు ఏనాడు పట్టించుకున్నరు? ఇప్పుడు మళ్ల ఎన్నికలొస్తే రైతులను ఆగం చేసే మాటలు మాట్లాడుతున్నరు. కౌలుదారు చట్టం తెస్తే పట్టాదారులు, యజమానులు భయపడే ప్రమాదముంది.
రైతులకు వీలుకాని సమయాల్లో తన భూమిని ఇతరులకు కౌలుకు ఇస్తే రికార్డుల్లో నమోదు చేయడం వల్ల కొద్ది రోజులకు కౌలుదారు కోర్టుకెళ్తే పట్టాదారులకు ప్రమాదమే. మా భూములపై ఇతరుల పేర్లు రికార్డులో ఎక్కిస్తే ఇబ్బందే కదా. దాని కంటే భూములు ఖాళీగా ఉంచుకోవడం నయం. ఎవరికీ ఏ బాధ లేకుంట అందరూ సంతోషంగ ఎవుసం చేసుకుంటే కాంగ్రెస్కు ఏం బాధ అయితంది. ధరణిని రద్దు చేస్తే ఊరుకోం.
– పిడుగు లావణ్యరెడ్డి, మహిళా రైతు, బొమ్మెన, కథలాపూర్ మండలం, జగిత్యాల జిల్లా
రైతుల సంతోషం కేసీఆర్ చలవే
ఈ రోజు రైతులు సంతోషంగా ఉన్నారంటే అది సీఎం కేసీఆర్ చలవే. కాంగ్రెసోళ్ల కాలంలో రైతుకు కరెంటు కష్టాలు తప్పలేదు. రాత్రిళ్లు పొలంగట్లపై పడిగాపులు పడ్డాం. ఇప్పుడు మళ్లీ మూడు గంటలు చాలు.. 10 హెచ్పీ మోటర్లు పెట్టిస్తాం అంటున్నారు.
వారెన్ని మాటలు చెప్పినా రైతులు నమ్మరు. 24 గంటల కరెంటుతో ఇప్పుడు వ్యవసాయం పండుగలా మారింది. రైతులకు రైతుబంధు వస్తున్నది. అన్నదాతల సంక్షేమాన్ని పట్టించుకున్న కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ రావాలి. వర్షాకాలం పంట సాగులో కోతలు సైతం కోశాం. పంట బాగా పండింది. యాసంగికి సైతం నారు పోసేందుకు సిద్ధమయ్యాం.
– ఆవుల రామచంద్రారెడ్డి, రైతు, మోరంపల్లిబంజర, బూర్గంపహాడ్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం
మళ్ల కరెంట్ బాధలు భరించలేం
గతంల కరెంటుతో చానా బాధలు పడ్డం. ఇక భరించలేం. కరెంట్ కోతల వల్ల వేసిన పంటలు ఎండిపోయి పెట్టుబడి రాక గోస పడ్డం. రోడ్లపై ఆందోళనలు చేసినం. బావుల్ల నీరున్నా ఎకరం, రెండెకరాలు పారుడే కష్టంగుండేది.
తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటిత్తాండు. రెండు పంటలు పండించుకుంటూ సంతోషంగ ఉన్నం. రైతుల కోసం ఆలోచన చేసే గొప్ప వ్యక్తి కేసీఆర్. కాంగ్రెసోళ్లు 10 హెచ్పీ మోటర్లు పెట్టాలంటున్రు. ఇక్కడ అవి సాధ్యం కాదు. అవి బిగిస్తే ఖర్చు ఎక్కువ వస్తది. బోర్లు ఎండిపోతయ్. కరెంటు కష్టాలు మళ్లీ మొదలవుతాయి. 24గంటల కరెంటుతో రంది లేకుంట బతుకుతున్నం.
– అంకిరెడ్డి సుధాకర్రెడ్డి, రైతు మల్లంపెల్లి, పాలకుర్తి, జనగామ
పని అలకగా అయింది
ఇటీవలే మా అన్నదమ్ములం భూములు పంచుకున్నం. నాకు ఎకరం భూమి వచ్చింది. ఒక రోజు స్లాట్ బుక్ చేసుకున్నం. ఆ రోజే గంభీరావుపేట తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకున్నం. అలకగా పని అయ్యింది.
అప్పట్లో భూములు కొనాలన్నా.. అమ్మాలన్న పట్వారుల దగ్గరికీ తిరిగి తిరిగి కాళ్ల చెప్పులు అరిగేయి. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో భూ రికార్డులు పదిలంగా ఉన్నయి. ధరణి రికార్డులో నమోదైన భూమి వివరాలు, యజమాని వేలిముద్ర, అనుమతి లేకుండా రికార్డులు మార్చేందుకు ఎవరికీ సాధ్యం కాదు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తామంటున్రు. భూమాత పెడుతామంటున్రు. కౌలుదారు, అనుభవదారు కాలాలు పెడుతామంటున్రు. దాని వల్ల పంచాయితీలు ఎక్కువవుతయి. ఒకరి పేరు మీద ఉన్న భూమి మరొకరి పేరుపై రాస్తరు. ధరణితోనైతే అంతా ఆన్లైన్లో ఉండడం వల్ల రైతులకు ఇబ్బంది లేకుండా ఉంది.
– నస్కంటి లక్ష్మీనారాయణ, రైతు, గంభీరావుపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా