హైదరాబాద్, సెప్టెంబర్15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంజినీర్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కొనియాడారు. సమాజప్రగతిలో కీలక భూమిక పోషించే ఇంజినీర్లు ఉమ్మడి రాష్ట్రంలో ఈపీసీ సిస్టం వల్ల తమ ఆస్తిత్వాన్ని కోల్పోయారని, ఇప్పుడు స్వరాష్ట్రంలో కేసీఆర్ వల్లే సమున్నత స్థానంలో నిలబడి గొప్ప విలువను పొందగలుగుతున్నారని అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా బుధవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (ఐఈ) తెలంగాణ స్టేట్ సెంటర్లో 54వ ఇంజినీర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఇంజినీర్లు సమిష్టి కృషితో స్వల్ప కాలంలోనే సాగు, విద్యుత్తు, రవాణా రంగాల్లో రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చివేశారని ప్రశంసించారు. మిషన్భగీరథ, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులను మూడేండ్ల వ్యవధిలోనే ఆవిష్కరించడం వారి ప్రతిభకు, అంకితభావానికి నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రిగానే కాకుండా ఒక సివిల్ ఇంజినీర్గా కూడా పనిచేసే అవకాశం తనకు దక్కడం, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవడం గర్వంగా ఉన్నదని తెలిపారు. ఇంజినీర్స్ డే వేడుకల్లో ప్రసంగించిన వక్తలు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తిచేయడం తెలంగాణ ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణమన్నారు.
అవార్డుల ప్రదానం
ఉత్తమ సేవలందించిన పలువురు ఇంజినీర్లకు ఈ వేడుకల్లో జ్ఞాపికలతోపాటు, నగదు పురస్కారాలను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో ఐఈ చైర్మన్ రమణనాయక్, తెలంగాణ సాగునీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, జేఎన్టీయూ వీసీ నర్సింహారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఐఈఐ గౌరవ కార్యదర్శి అంజయ్య, పూర్వ చైర్మన్ సత్యనారాయణ, విశ్రాంత ఇంజినీర్లు శ్యాంప్రసాద్రెడ్డి, వెంకటేశం, ఐఈఐ మెంబర్లు, ఫెలోలు, పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు.