హైదరాబాద్ : తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణ జలాలను కేసీ కెనాల్కు తరలించాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోందని, నీటి తరలింపును నిలిపివేయించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ఒకటి, రెండు అవార్డుల ద్వారా అనుమతించిన దానికంటే ఎక్కువ నీటిని తరలించేందుకు యత్నిస్తుందని లేఖలో పేర్కొన్నారు. ట్రిబ్యునల్ ఒకటో అవార్డు కేసీ కెనాల్, తుంగభద్ర రైట్ బ్యాంక్ హైలెవెల్ కెనాల్, రైట్ బ్యాంక్లో లెవెల్ కెనాల్ తుంగభద్ర డ్యామ్ నుంచి మాత్రమే తుంగభద్ర నీటిని ఉపయోగించాలని నిర్దేశించిందని, కానీ, ఏపీ మాత్రం కృష్ణా నీటిని కేసీ కెనాల్కు వినియోగిస్తుందని ఆరోపించారు.
తుంగభద్ర రైట్బ్యాంక్ హైలెవెల్ కెనాల్ దాని కేటాయింపులో 81.5శాతం పెన్నా బేసిన్లోని కృష్ణా బెసిన్ వెలుపల ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-1, 2 అవార్డులు బెయిన్ ఆవలికి నీటిని తరలించేందుకు అనుమతించలేదన్నారు. దీనికి విరుద్ధంగా టీబీ ఆర్బీ కానీ, టీబీ ఆర్బీ హెచ్ఎల్సీ ద్వారా ఎక్కువ నీటిని బెసిన్ ఆవలికి ఏపీ మళ్లిస్తోందన్నారు. సుంకేశుల ద్వారానే తుంగభద్ర జలాలను వినియోగించాలని, కేసీ కెనాల్ ఆయకట్టుకు తుంగభద్ర జలాలు వాడాలన్నారు. కేసీ కెనాల్కు కృష్ణా జలాల తరలింపును నిలిపివేయించాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శిని తెలంగాణ ఈఎన్సీ కోరారు.