హైదరాబాద్ : ఆర్డీఎస్(రాజోలి బండ డైవర్షన్ స్కీమ్) కుడి కాల్వ పనులపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనుల పరిశీలన కోసం బృందాన్ని పంపాలని ఈఎన్సీ కోరారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పునకు, విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పనులు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్.. కేఆర్ఎంబీ చైర్మన్కు జులై 12న లేఖ రాసిన సంగతి తెలిసిందే.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆదేశాలను ఏపీ ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. బ్రిజేశ్కుమార్ తీర్పును అనుసరిస్తూ తుంగభద్ర నదిపై నిజాం కాలంలో కర్ణాటకలో నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళీ బండ డైవర్షన్ స్కీం) నుంచి అక్రమంగా కాల్వను ఏర్పాటు చేసుకొని నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం గతేడాది జూన్లో చర్యలు చేపట్టింది. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల అనుమతులు లేకుండా ఆర్డీఎస్ కుడి వైపు పనులను వేగంగా పూర్తి చేసింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానది నుంచి ఏపీకి 4 టీఎంసీల నీటి కేటాయింపులు జరిపింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు అస్తవ్యస్తంగా చేపట్టిందని ఈ తీర్పును నిలిపివేయాలని తెలంగాణ జలవనరుల శాఖ అధికారులు గతంలోనే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశారు. అదీగాక ఆర్డీఎస్ కుడివైపు కెనాల్ పనులు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో కొంతకాలం పనులు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా స్ట్రక్చర్ నిర్మాణం పనులు పూర్తి చేసి గేట్లు అమర్చేందుకు కసరత్తు చేస్తున్నది.
ఏపీ ప్రభుత్వం రూ.1,985.423 కోట్ల వ్యయంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట కుడి కాల్వ పనులకు గత ఏడాది శ్రీకారం చుట్టింది. 4 టీఎంసీల నీటిని తరలించేందుకు కాల్వను తవ్వి గ్రావిటీ ద్వారా 40 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు 4 లిఫ్టులను ఏర్పాటు చేసి మరో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అక్రమంగా నీటిని తరలించే కుట్రలు చేస్తున్నది. కర్నూల్ జిల్లాలోని రైతులకు సాగు, తాగునీటిని పుష్కలంగా అందించాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ కుడివైపు కాల్వ పనులు చేపట్టింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకొని తుంగభద్ర నది నుంచి నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వంతోపాటు నదినీటి హక్కులు కలిగిన రాష్ర్టాల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ కుడివైపు కాల్వ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా చేపట్టగా పనులు తుది దశకు చేరుకొన్నాయి.
ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కుడివైపు చేపట్టిన కాల్వ నిర్మాణంతో తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజక వర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీటికి కటకట ఏర్పడనున్నది. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి గ్రావిటీ ద్వారా ఏపీ ప్రభుత్వం సునాయసంగా నీటిని తరలించేందుకు అవకాశం మెండుగా ఉండటంతో ఎడమ కాల్వ (తెలంగాణ ఆయకట్టు)కు నీటి రాక తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ఏనాడు 35 వేల ఎకరాలకు సాగునీరు అందిన దాఖలాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నిరుపయోగంగా మారే అవకాశాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. ఆర్డీఎస్ కుడివైపు కాల్వ నిర్మాణంతో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలో వంద గ్రామాలు తాగునీటికి, ఆర్డీఎస్ ఆయకట్టు 87,500 ఎకరాలు, నదితీర ప్రాంత ఆయకట్టు దాదాపు 4 లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం ఉన్నదని రైతులు పేర్కొంటున్నారు.