హైదరాబాద్ : కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ) చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ ఎండీడీఎల్పై ఆధారపడి లేవని కేఆర్ఎంబీ తేల్చిచెప్పడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ రెండు జలాశయాలు.. ఉమ్మడి ప్రాజెక్టులని, వాటికి సంబంధించిన రూల్ కర్వ్స్ ను ఏ ప్రాతిపదికగా నిర్ధారించారో చెప్పాలని డిమాండ్ చేసింది.
పాత రికార్డులు లేకుండా అంశాలను అర్థం చేసుకోలేమని తెలంగాణ తేల్చిచెప్పింది. రూల్ కర్వ్స్ తయారీ, సాంకేతిక అంశాలు అర్థం చేసుకోవాల్సి ఉందని తెలిపింది. అర్థం చేసుకోవడానికి పాత రికార్డులు కావాలని తెలంగాణ కోరింది. తామేమీ రహస్య సమాచారం అడగడం లేదని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. వీలైనంత త్వరగా కేంద్ర జల సంఘం నుంచి సమాచారం తెప్పించి ఇవ్వాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.