హైదరాబాద్ : రాష్ట్రంలో ముంపుపై పీపీఏ భేటీలో ప్రస్తావించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. పోలవరం వెనుక జలాల వల్ల రాష్ట్రంలో ముంపుపై ప్రధానంగా ప్రస్తావించామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి కేంద్ర జలసంఘం ప్రతినిధులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్సీలు, ఇంజినీర్లు హాజరయ్యారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మీడియాతో మాట్లాడారు. పోలవరంపై ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని అంశాలను ఇప్పటికే లేవనెత్తాయని తెలిపారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం ఆధ్యయనం చేయిస్తుందన్నారు. ఉమ్మడి సర్వేకు ఆంధ్రప్రదేశ్ కూడా అంగీకరించింది. 892 ఎకరాలు ముంపునకు గురవుతాయని రాష్ట్ర ఇంజినీర్లు తేల్చారు. ఉమ్మడి సర్వే తర్వాత తగిన చర్యలు తీసుకుంటారని ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు.