రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన
అనుచిత వ్యాఖ్యలు సహించబోం
ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
నమస్తే తెలంగాణ నెట్వర్క్: తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉద్యోగులు భగ్గుమన్నారు. రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఉద్యోగులంతా ముక్తకంఠంతో ఖండించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిరసనలతో హోరెత్తించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్న భోజన సమయంలో కార్యాలయాల ఆవరణలో ఆందోళనకు దిగారు. సంగారెడ్డిలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నిరసనలో పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి గృహకల్ప ప్రాంగణంలో జేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవో అధ్యక్షురాలు వీ మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ తదితరులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్, మమత మాట్లాడుతూ.. తెలంగాణకు ద్రోహం చేసే నాయకులను, అనుచిత వ్యాఖ్యలను సహించేదిలేదని హెచ్చరించారు. ప్రధాని మోదీ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యోగులంతా ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఉద్యమించామని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే ప్రపంచమే ఆశ్యర్యపోయేలా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని, ఇలాంటి రాష్ట్రంపై విషం కక్కడం అత్యంత దారుణమని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం 30శాతం పీఆర్సీని అమలుచేసి, వేతనాలను గణనీయంగా పెంచి ఉద్యోగులను ఆదుకొంటుంటే, మోదీ ప్రభుత్వం ఆదాయపన్నుతో గుంజుకొంటున్నదని ఆగ్రహించారు. తక్షణమే ఆదాయ పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాల్లో టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, టీఎన్జీవో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సుశీల్బాబు, నిజామాబాద్లో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ అలుక కిషన్, కామారెడ్డిలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముస్లిం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్ డిమాండ్చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఆయన మాట్లాడారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.