హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టనున్నారు. పీఆర్సీ సాధన కోసం సెప్టెంబర్ 6న సంకల్ప సభ నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. అదేవిధంగా 1వ తేదీని సీపీఎస్ విద్రోహ దినంగా పాటిస్తూ ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు హైదరాబాద్లో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై విసృ్తతంగా చర్చించారు. పలు తీర్మానాలు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ మీడియాకు వెల్లడించారు.
పెండింగ్ పీఆర్సీ, డీఏల సాధనతోపాటు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఉద్యమ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. సెప్టెంబర్1న ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏల సాధన కోసం సెప్టెంబర్ 6న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉద్యోగుల సంకల్ప సభ నిర్వహించనున్నట్టు వెల్లడించింది.