హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘జబ్బకు సంచి.. చేతిలో జేఏసీ జెండా తో లక్ష మంది ఉద్యోగ, పెన్షనర్లు హైదరాబాద్కు దండుకట్టండి’ తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ పిలుపు ఇచ్చింది. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఈనెల 10న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జేఏ సీ వెల్లడించింది. దీనికి ‘ఉద్యోగుల హక్కుల సాధన సభ’గా నామకరణం చేసింది.
లక్ష మంది ఉద్యోగులతో హైదరాబాద్లో కదంతొక్కుతామని జేఏసీ ప్రకటించింది. కుటుంబసభ్యులు, పిల్లలతో ఈ సభకు హాజరై ప్రభుత్వానికి నిరసన తెలుపుదామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించారు. సచివాలయం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు చెందిన జేఏసీ నేతలతో ‘చలో హైదరాబాద్’ విజయవంతంపై సమాలోచనలు జరిపారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. ఉద్యోగులంతా సామూహిక సెలవులు పెట్టి ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చే ఉద్యోగులను కలెక్టర్లు ఇబ్బందులు పెట్టొద్దని హితవు పలికారు.
మంత్రి లేకపోవడం విచారకం: మారం
ఉద్యోగులతో చర్చించేందుకు, తమ సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించేందుకు ప్రత్యేక మంత్రి లేకపోవడం బాధాకరమని జే ఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము మంత్రు ల వద్దకు వెళ్తే గంటల తరబడి వేచిచూడాల్సి వస్తున్నదని, రేపు, ఎల్లుండి రండి అన్న సమాధానాలే ఎదురవుతున్నాయని తెలిపారు. సమావేశాలకు పిలిచి చాయ్, బిస్కట్ ఇచ్చి ఉత్త చేతులతో పంపుతున్నారే తప్ప పరిష్కారం చూపడంలేదని చెప్పారు.
మూడేండ్లు వేచిచూశాం: ఏలూరి
‘ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మూడేండ్లు వేచిచూశాం. ఇక ఓపిక పట్టలేము. ఇన్నేైండ్లెనా పరిష్కారం కాకపోవడంతోనే ఉద్యమానికి దిగుతున్నాం’ అని జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ సభకు ఉద్యోగులను సన్నద్ధం చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గురువారం మహబూబ్నగర్, నల్లగొండ, ఈ నెల 5న ఖమ్మం, వరంగల్, 7, మెదక్, నిజామాబాద్, 8న ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అనుమతివ్వకుంటే కోర్టుకెళ్తాం: హుస్సేనీ
ఉద్యోగుల హక్కుల సాధన సభకు ప్రభుత్వం, పోలీస్శాఖ బేషరతుగా అనుమతినివ్వాలని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని (ముజీబ్) డిమాండ్ చేశారు. అనుమతిస్తే గౌరవంగా ఉంటుందని, లేకుంటే కోర్టుకెళ్తామని స్పష్టంచేశారు. తాము సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. తమ సమస్యలపై ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ కమిటీ సూచించిన పరిష్కార మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.