హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): దేశ వైద్య రంగంలో తెలంగాణ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న ఏకైక రాష్ట్రంగా నిలువబోతున్నది. తెలంగాణలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు దశలవారీగా 25 జిల్లాల్లో వాటిని అందుబాటులోకి తెచ్చింది. మిగిలిన 8 జిల్లాల్లో మెడికల్ ఏర్పాటుకు తాజాగా అనుమతి ఇచ్చింది.
జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ వైద్యారోగ్య శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. తద్వారా రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కేవలం 9 ఏండ్లలోనే 29 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అరుదైన ఘనతను దక్కించుకోబోతున్నది. దీన్ని తెలంగాణ సాధించిన మరో విప్లవంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అభివర్ణించారు. కొత్తగా ఏర్పాటయ్యే 8 కాలేజీల్లో 100 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్నది. దీంతో కొత్తగా మరో 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి.
సీఎం కేసీఆర్ ఉక్కు సంకల్పం
ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలో వైద్యరంగం తీవ్ర నిరాదరణకు గురైంది. నాడు తెలంగాణలో ఏ ప్రాంతంవారికి పెద్ద రోగం వచ్చినా హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కు. వందల కిలోమీటర్ల దూరం, గంటల సేపు సమయం ప్రయాణించాల్సిన దుస్థితి. దీంతో సకాలంలో వైద్య సదుపాయాలు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉండేది. అప్పట్లో పేదలకు ఎంబీబీఎస్ చదువు కలగా మిగిలిపోయింది. ఉద్యమ సమయంలో ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందించడంతో పాటు, వైద్య విద్యను చేరువ చేయాలని సంకల్పించారు.
9 ఏండ్లలోనే 29 కాలేజీలు
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 మాత్రమే. వాటిలో ఉస్మానియా (1946), గాంధీ (1954) మెడికల్ కాలేజీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందు నుంచే ఉన్నాయి. ఆరుదశాబ్దాల ఉమ్మడి పాలనలో కేవలం 3 వైద్య కళాశాలలు (వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్లో రిమ్స్, నిజామాబాద్లో మరో ప్రభుత్వ మెడికల్ కాలేజీ) మాత్రమే ఏర్పాటయ్యాయి.
2014లో స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్.. మెడికల్ కాలేజీల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. తొలుత మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశారు. రెండో విడతలో ఏర్పాటైన 8 మెడికల్ కాలేజీల్లో నిరుడు తరగతులు మొదలయ్యాయి. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన 8 జిల్లాలకు బుధవారం మెడికల్ కాలేజీలను మంజూరు చేశారు. ఇవి వచ్చే ఏడాది ఇవి అందుబాటులోకి రానున్నాయి. దీంతో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. తద్వారా రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు పెరుగుతుంది.
ఐదున్నర రెట్లు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు
రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు గత తొమ్మిదేండ్లలో గణనీయంగా పెరిగాయి. 2014 నాటికి తెలంగాణలో కేవలం 850 మెడికల్ సీట్లు అందుబాటులో ఉండేవి. ఈ ఏడాది కొత్తగా 9 కాలేజీల ఏర్పాటుతో సీట్ల సంఖ్య 3,790కి పెరిగింది. తాజాగా అనుమతి ఇచ్చిన 8 కాలేజీలతో మరో 800 సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మొత్తం సీట్ల సంఖ్య 4,590కి పెరుగుతుంది. అంటే.. 9 ఏండ్లలోనే ఐదున్న రెట్లు పెరుగునున్నాయి.
2014కు ముందు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి 20 మెడికల్ కాలేజీలు ఉండేవి. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,850 నుంచి 8,340కు పెరిగింది. కొత్తగా ఏర్పాటయ్యే 8 మెడికల్ కాలేజీలను కలిపితే సీట్ల సంఖ్య 9,140కి చేరుతుంది. వచ్చే ఏడాదికి దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు కాలేజీల ద్వారా మరికొన్ని సీట్లు అందుబాటులోకి రానుండటంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువవుతుంది.
ఇప్పటికే ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్న తెలంగాణ.. పీజీలో 7.5 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. 2023-24లో దేశంలో కొత్తగా 2,118 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తే.. అందులో 900 సీట్లు (43 శాతం) తెలంగాణవే.
వైద్య విద్యార్థుల కల సాకారం
రాష్ట్రంలో కొత్త కాలేజీలు ఏర్పాటు చేయడమే కాకుండా తద్వారా అందుబాటులోకి వస్తున్న ఎంబీబీఎస్ సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దకేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ కాలేజీల్లోని బీ-క్యాటగిరీ సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే చెందేలా నిరుడు లోకల్ రిజర్వేషన్ తీసుకురావడంతో అదనంగా 1,820 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
తెలంగాణలో 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ ఏడాది నుంచి 100 శాతం తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మరో 520 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీల ఏర్పాటు, రిజర్వేషన్ నిర్ణయాలతో తెలంగాణ విద్యార్థులకు వైద్యవిద్య మరింత చేరువైంది. భారీ ఖర్చుతో చైనా, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు వెళ్లి అష్టకష్టాలు పడాల్సిన అగత్యం తప్పింది. తల్లిదండ్రులకు బెంగ తొలగిపోయింది.
సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం
రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వైద్య కళాశాలలను మంజూరు చేయడంతో ఆయా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం మెదక్లోని రాందాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు కావడంతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మల్దకల్, ధరూర్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ములుగులో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సత్యవతిరాథోడ్ చిత్రపటాలను పాలతో అభిషేకించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పార్టీ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో తెలంగాణ వైద్యవిద్యలో విప్లవం సృష్టించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, అనతి కాలంలోనే మాట నిలబెట్టుకున్న ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. సీఎం కేసీఆర్కు తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతోపాటు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టమైన విజన్ ఉన్నది. విద్యార్థులకు వైద్య విద్యను, ప్రజలకు కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు సీఎంగా కేసీఆర్ ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నది అక్షర సత్యం. కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి, భూపాలపల్లి, గద్వాల లాంటి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటుకావడం గొప్ప విషయం.
– ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు
తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటు ఇలా..
స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు: 5 గాంధీ (1954), ఉస్మానియా (1946), కాకతీయ మెడికల్ కాలేజీ (1959), రిమ్స్ ఆదిలాబాద్ (2008), నిజామాబాద్ మెడికల్ కాలేజ్ (2013).
తెలంగాణ ఏర్పాటు తర్వాత: 29