హైదరాబాద్ : విద్యారంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. తెలంగాణ గురుకులాలు యావత్తు దేశానికే ఆదర్శప్రాయమన్నారు. అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్టీవో) జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొలి రోజు సమావేశాలకు ఏఐఎఫ్టీవో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశ్వినికుమార్ అధ్యక్షత వహించారు. దేశంలో16 రాష్ట్రాల నుంచి 25 ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన అనంతరం సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ అభివృద్ధిలో పురోగమిస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు భీమా వంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, ప్రభుత్వ చొరవతో తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందన్నారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా గురుకులాలను ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, వీటిల్లోని ఒక్కో విద్యార్థిపై రూ. 1. 20లక్షలు ఖర్చుచేస్తున్నామన్నారు. ముందుచూపుతో 33 జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ప్రతి 600 మంది జనాభాకు ఒక వైద్యుడు అందుబాటులోకి వస్తారని వినోద్కుమార్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తంచేశారు.