హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో ఆంధ్రా పాలకుల పెత్తనానికి తెరదించి స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. నేడు అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ పటిష్ఠమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకొంటున్నది. కేవలం ఎనిమిదేండ్ల స్వల్ప వ్వవధిలోనే సొంత కాళ్లపై నిలబడి, స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. తలసరి ఆదాయాన్ని భారీగా పెంచుకోవడంతోపాటు పన్నుల రూపంలో దేశానికి అత్యధికంగా నిధులను సమకూరుస్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర జీఎస్డీపీతోపాటు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గణనీయంగా పెరగడంతో ఇది సాధ్యమైంది. 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు రూ.5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ.. 2021-22 నాటికి రూ.11,54,860 కోట్లకు వృద్ధి చెందింది. దీని వల్ల రాష్ట్ర ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి రెట్టింపు కంటే అధిక స్థాయికి పెరిగింది. నిరుడు జూలైలో రూ.3,640 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది జూలైలో ఏకంగా 28% వృద్ధిచెంది రూ.4,547 కోట్లకు చేరాయి. మరోవైపు తలసరి ఆదాయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. 2014-15లో రూ.1,24,104గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. 2021-22లో రెట్టింపు కంటే అధికమై రూ.2,78,833కు పెరిగింది. ఇది రూ.1,49,848గా ఉన్న జాతీయ సగటు తలసరి ఆదాయం కంటే 86% అధికం.
రాష్ట్రానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ 4 శాతమే
కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు ఈ ఏడాది జూలై వరకు 21% రాగా.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వచ్చింది మాత్రం 4 శాతమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో కేంద్రం నుంచి వివిధ రూపాల్లో తెలంగాణకు రూ.59,396 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా.. జూలై ఆఖరు వరకు కేవలం రూ.4,604 కోట్లే వచ్చాయి. ఇందులో కేంద్ర పన్నుల వాటాగా రూ.2,616 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.1,988 కోట్లు ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్లలో తీసుకొన్న బట్జెటేతర రుణాలతోపాటు కార్పొరేషన్ల రుణాలను కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తీసుకురావడంతో ఈ ఏడాది రాష్ట్ర రుణ అంచనాల్లో రూ.19 వేల కోట్ల మేర కోత పడింది. బాండ్ల విక్రయం ద్వారా ఈ ఏడాది రూ.55,530 కోట్ల రుణాలను సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా.. కేంద్రం పెట్టిన కొర్రీతో అది రూ.36,530 కోట్లకు తగ్గింది. ఇందులో జూలై వరకు రాష్ట్రం రూ.10,340 కోట్ల రుణాలను మాత్రమే తీసుకున్నది. మరోవైపు కేంద్ర పన్నుల రూపంలో రాష్ర్టానికి రావాల్సిన వాటా, తెలంగాణలో అమలవుతున్న కేంద్ర పథకాలకు అంచనాల మేరకు అందడం లేదు. వీటితోపాటు ఆర్థిక సంఘాలు, నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులు, జీఎస్టీ పరిహారం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి (బీఆర్జీఎఫ్)కి కేంద్రం విడుదల చేయాల్సిన బకాయిలపై నీలినీడలు కొనసాగుతున్నాయి.
ఆర్థిక క్రమశిక్షణ, పటిష్ఠ ప్రణాళిక
తెలంగాణను అన్నివిధాలా అణగదొక్కేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నప్పటికీ రాష్ట్రం మాత్రం రోజు రోజుకూ ఆర్థికంగా ఎదుగుతూనే ఉన్నది. పటిష్ఠ ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంటుకొంటూ బడ్జెట్ లక్ష్యాలను నెరవేర్చుకొనే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ ఏడాది జూలై ఆఖరు వరకు రూ.44,058 కోట్ల సొంత రాబడులను సమకూర్చుకున్నది. ఈ ఆర్థిక సంవత్సర అంచనా (రూ.1,39,612 కోట్ల)లో ఇది 31 శాతానికి సమానం. ఈ ఆర్థిక సంవత్సరంలో పలు కొత్త పథకాలు, భారీ కార్యక్రమాలను అమలు చేయాలన్న లక్ష్యంతో రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. అధిక రాబడులను అందించే కీలక శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీటిలో వాణిజ్య పన్నుల శాఖ ప్రధానమైనది. ప్రస్తుతం ఈ శాఖ రాబడులు అంచనాల మేరకే ఉన్నప్పటికీ పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టి, పెద్ద బకాయిలను వసూలు చేయడం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా రూ.2 వేల కోట్ల మొండి బకాయిలు, వివాదాస్పద పన్ను బకాయిల వసూలుకు వన్టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది.
రాష్ట్ర వాటాలో కేంద్రం కొర్రీలు
రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటు కంటే ఎంతో ఎక్కువగా ఉండటాన్ని నరేంద్రమోదీ సర్కార్ జీర్ణించుకోలేకపోతున్నది. అందుకే దేశ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్న తెలంగాణపై ఆది నుంచే వివక్ష చూపుతున్నది. రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా మోకాలడ్డుతున్నది. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సైతం కోలుకోలేని దెబ్బతీయాలని కుట్ర పన్నిన మోదీ సర్కార్.. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా వేధిస్తున్నది. కేంద్రం తన రెవెన్యూ రాబడిలో రాష్ట్రాలకు రాజ్యంగబద్ధంగా వాటా ఇవ్వాల్సి ఉన్నది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 42%, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 41% పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ సెస్సుల పేరుతో గండి కొడుతున్నది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు 29.6 శాతానికి మించి రెవెన్యూ బదలాయింపు జరగటం లేదని స్వయానా కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తున్నాయి. తెలంగాణకు ఆ మాత్రం కూడా జరగడం లేదన్నది జగమెరిగిన సత్యం. రాష్ర్టాలను పక్కకు నెట్టి కేంద్రం సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తాన్ని కార్పొరేట్ టాక్స్ తగ్గింపు వల్ల ఏర్పడుతున్న లోటును పూడ్చుకోవడానికి, కార్పొరేట్ ఉద్దీపనలకు ఎక్కువగా వినియోగిస్తున్నదని అర్థిక వేత్తలు విమర్శిస్తున్నారు.