హైదరాబాద్, జూలై15, (నమస్తే తెలంగాణ): తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు రాష్ట్రంలోని 34,891 బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనిలో భాగంగా తొలుత 33 జిల్లాలకు చెందిన జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్ల(డీఎల్ఎంటీ)కు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఒకరోజు శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
బీఎల్వోల, సూపర్వైజర్ల పాత్ర, అనుసరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో బూత్ లెవల్ అధికారులదే కీలకపాత్ర అని వికాస్రాజ్ పేర్కొన్నారు. 18న జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. 19 నుంచి 25 వరకు మండల స్థాయిలో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలయ్యేంత వరకూ ఎలక్షన్ కమిషన్ సూచనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు.