మహాబాహుబలి మోటర్లు గర్జిస్తుండగా.. భారీ సొరంగాలు జలసవ్వడిని పిలుస్తుండగా..
‘కృష్ణమ్మ’ పాలమూరులో జలతాండవం చేసింది. సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో చుక్కనీరు లేక పల్లేర్లు మొలిచిన నేలపై పాలనురగలా శ్రీగిరి గంగ పరవళ్లు తొక్కింది.
ఈ నేలను తడపకుండా ఇన్నేండ్లు పాలమూరు తలాపునుంచి పోయిన కృష్ణమ్మ.. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ సంకల్పంతో ఎదురెక్కి బీడుభూములను తడిపేందుకు బిరబిరా పరుగులు తీసింది.
పాలమూరు గడ్డ దశాబ్దాల కలను సాకారం చేసేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కేసీఆర్ నార్లాపూర్ పంప్హౌస్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించగా, దేశ సాగునీటి రంగంలో మరో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది.
చిన్న అప్రోచ్ కెనాల్గా ప్రారంభమై జలతరంగంలా అంజనగిరి రిజర్వాయర్లోకి చేరిన కృష్ణాజలాలకు జలదాత కేసీఆర్ హారతిపట్టగా.. ఈ అపూర్వ ఘట్టం చూసి యావత్తు పాలమూరు రైతాంగం ఉప్పొంగింది.
వలసలగోస అనుభవించిన పాలమూరు జనం కన్నీళ్లను కృష్ణా జలాలతో తుడిపేందుకు తెలంగాణ ఏర్పడ్డ ఏడాదిలోనే మొట్టమొదట శంకుస్థాపన చేసిన పాలమూరు ప్రాజెక్టు.. కేసీఆర్ దృఢ సంకల్పంతో అనతికాలంలోనే ఆవిష్కృతమై..తెలంగాణ జలవిజయంగా నిలిచింది.
గుట్టలే ఆనకట్టలుగా.. భూ అంతర్భాగ నిర్మాణాలు.. అతిపెద్ద సర్జ్పూల్లతో సాక్షాత్కారమైన ఈ ఇంజినీరింగ్ అద్భుతం ప్రపంచ నీటిపారుదల రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మూడేండ్ల కిందటే పూర్తయ్యేది. దానిని అడ్డుకున్నది పాలమూరు జిల్లాకు చెందిన గత్తర, బిత్తిరి రాజకీయనాయకులే. నాడు వారు నీళ్లకోసం ఏమీ చేయలేదు. ఏనాడూ నోరు తెరువలేదు. ఇతరులకంటే పాలమూరులో ఉన్న నాటి దద్దమ్మ రాజకీయ నాయకులే తెలంగాణకు శత్రువులు. నేను ఆనాటి నుంచీ చెప్తున్నా.. ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనారు.
ఒకనాడు పాలమూరు బిడ్డ హైదరాబాద్ గడ్డపై కూలీ.. నేడు పాలమూరు బిడ్డ పంటలు పండించే రైతు బిడ్డ
– సీఎం కేసీఆర్
పాలమూరు జిల్లాలోని బీజేపీవాళ్లకు సిగ్గు, శరం, చీమూ నెత్తురుంటే సమాధానం చెప్పాలి. పదేండ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కృష్ణానదిలో మాకు ఎంత వాటా వస్తుందో తేల్చాలని అడిగినం. ఇంతపెద్ద విశ్వగురువని చెప్పుకొనే ప్రధాని, మా అంత సిపాయిలు లేరనే బీజేపీ, ఇక్కడ పెద్దపెద్ద పోజులు కొట్టే నాయకులు, కార్యకర్తలు పదేండ్లుగా ఎందుకు ఏమీ చేయలేకపోయారు?
70 ఏండ్లు ఏడ్చిన పాలమూరును నాడు ఎవ్వడూ పట్టించుకోలేదు. తెలంగాణను ధ్వంసం చేసింది ఈ కాంగ్రెస్సోళ్లు కాదా? తెలంగాణను ఉద్ధరిస్తా, దత్తత తీసుకున్నా అని చెప్పి పునాదిరాళ్లు పాతి ప్రాజెక్టును పెండింగు పెట్టింది చంద్రబాబు కాదా? మనం ఏడ్చిననాడు, వలస పోయిననాడు ఎవరన్నా సాయం చేసిన్రా? మనం కొట్లాడి రాష్ట్రం సాధించుకొని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాం. ఈ క్రమంలో ఆగమైతే గోస పడతాం.
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రా జెక్టు వెట్న్త్రో తన జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆనందం వ్యక్తం చేశారు. 2014లో పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు తన మనసు ఎం త ఉప్పొంగిందో.. ఇప్పుడు అంతే ఉప్పొంగుతున్నదని తెలిపారు. శనివారం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వెట్న్న్రు ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్లో నిర్వహించిన భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణమ్మ జలతాండవం చూస్తుంటే ఒళ్లంతా పులకరిస్తున్నదని సంతోషం వ్యక్తంచేశారు. ‘మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. ఒకనాడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్ అడ్డాలో వలస కూలీ. నేడు బెంగాల్, యూపీ, కర్ణాటక, ఏపీ నుంచి కూలీలను తెప్పించుకొని తమ పొలాల్లో పనులు చేయించుకొంటున్న రైతు బిడ్డ. ఇదీ మారిన ముఖచిత్రం’ అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణలోని జనాభా, ప్రాంతాలు అంచనాలు లెక్కలేసుకొని, మన హక్కులను చూసుకొని, మనకు రావాల్సిన వాటాలను లెక్కలేసుకొని మొత్తం మూడు పెద్ద ప్రాజెక్టులు మొదలుపెట్టుకున్నం. గోదావరి మీద కాళేశ్వరం, ఖమ్మంలోని సీతారామ ఎత్తిపోతలు, పాలమూరులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రాజెక్టుల ను మొదలుపెట్టాం. ఈ మూడు పూర్తయితే తెలంగాణ బ్రహ్మాండంగా ఓ వజ్రపు తునక అవుతుంది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి వస్తది. తెలంగాణ రైతులు కూడా తల ఎత్తుకొని బతికే స్థాయి వస్తదనే ఆలోచనతో ముందుకు పో తున్నం. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చి నా.. చాలావేగంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. సీతారామ ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కూడా మూ డేండ్ల కిందటే పూర్తయ్యేది. దానిని అడ్డుకున్నది పాలమూరు జిల్లాకు చెందిన గత్తర, బిత్తిరి రాజకీయనాయకులే. ఈ విషయాన్ని మహబూబ్నగర్ ప్రజలు గుర్తించాలి. నాడు వారు నీళ్లకోసం ఏమీ చేయలేదు. ఇతరులకంటే పాలమూరులో ఉన్న నాటి దద్దమ్మ రాజకీయ నాయకులే తెలంగాణకు శత్రువులు. నేను ఆనాటి నుంచి చెప్తు న్నా.. ఇంటి దొంగలే మనకు ప్రాణగండమైనా రు. ఈ జిల్లాలో పుట్టిన దద్దమ్మలు, సన్నాసులే ప్రాజెక్టును అడ్డుకున్నారు. ఆ నాడు నోరు తెరిచి ఎవ్వరూ మా నీళ్లేవి అని అడగలేదు. ఆనాడున్న సీఎంలను చూస్తే.. వీళ్లుకు లాగులు తడిచిపోయేవి. అందుకే ఎవ్వరూ మాట్లాడలేదు.
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ గురించి మీకు తెలిసిందే. అది 1954లో ఏపీ ఏర్పడకముందు కట్టిన ప్రాజెక్టు. దానిని కూడా మొత్తం నాశనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన తొలి పాదయాత్రనే అలంపూర్లో జోగులాంబ అమ్మవారి పాదాలకు దండం పెట్టి.. అక్కడ్నుం చి గద్వాల తేరు మైదానం దాక పాదయాత్ర చేసిన. ఆ సందర్భంగా కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి రాజోలిబండ తూములు మూసేస్తే.. మళ్లా మే ము బాంబులు పెట్టి బద్ధలు కొడతామని ఆం ధ్రాలోని కర్నూలు జిల్లా నాయకులు మాట్లాడారు. అదే రోజు నేను రాజోలి అనే గ్రామంలో నిద్ర చేసి, పొద్దున్నే కేసీ కెనాల్కు నీళ్లు ఇచ్చే సుంకేసుల బరాజ్ వద్దకు చేరుకున్నా. ఆంధ్రా నాయకుల వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చిన తర్వాత నాకు రక్తం మరిగింది. ఆ మీటింగ్లో.. బైరెడ్డి రాజశేఖర్రెడ్డీ.. భగవంతుడు నీకేమన్నా ఆరు చేతులిచ్చిండా? నీకు రెండే చేతులున్నయ్.. మాకూ రెండే చేతులున్నయ్.. నువ్ ఆర్డీఎస్ తూము బద్ధలు కొట్టుడుకాదు.. అక్కడ అడుగుపెట్టినా.. నేను నిలబడ్డ ఈ సుంకేసుల బరాజ్ను వంద బాంబులు పెట్టి పేల్చేస్తా’ అని నాడు ఆంధ్రప్రాంత నాయకులను హెచ్చరించిన. ఆ తర్వాత పాలమూరు ప్రజలు ఏమనుకుంటున్నారో కనుక్కోమని మీడియా మిత్రులను కో రిన.
వారు జిల్లాలోని అన్ని మూలలకు ఫోన్లు చేసి, విషయం కనుక్కొని పాలమూరులో మీరు చెప్పింది ఎవ్వరూ తప్పుగా తీసుకోలేదు. మాకు కూడా బాంబులేసే ఒక మొనగాడు పుట్టిండు. ఇప్పడు నీళ్లొస్తయ్ పాలమూరుకు అని ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. అయినా నేను ఏ బాంబు వేయలేదు. ఎవ్వర్నీ కొట్టకుం డా, ఎవ్వరినీ తిట్టకుండానే నీళ్లు సాధించాను. ఒకరోజు పాలమూరులో ఉద్యమిస్తున్నప్పుడు స్థానిక నాయకులకు నోళ్లు ఎందుకు పెగలడం లేదని విమర్శించా. పదవులు, పైరవీల భయానికి ప్రజల నోరు నొక్కుతున్నారని చెప్పిన. అప్పుడు వాళ్లు కేసీఆర్ నువ్ మస్తుగా మాట్లాడతవ్.. నీళ్లేమో కిందకున్నయ్ మనం గడ్డమీద ఉన్నం.. నీళ్లు ఎట్లొస్తయ్? అని ప్రశ్నించారు. దానికి నేను.. నీళ్లు కిందకు లేవురా వెధవా.. నీ మెదడు మోకాళ్లలో ఉన్నది. నీకు బుద్ధి లేదు అని చెప్పాను. ఆరోజు అడ్డంగా మాట్లాడిన నాయకులు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఈ రోజు పాలమూరుకు వచ్చిన కృష్ణా జలాలను చూస్తున్నారు.
పాలమూరులో నేను ఎంపీగా నిలబడితే ప్రజలు ఆశీర్వదించి గెలిపించారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక కరెంటు, మంచినీళ్లు, సాగునీళ్లు.. ఇలా ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటున్నాం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. మొదట కరెంటు, మంచి నీళ్ల మీద యుద్ధంచేసి విజయం సాధించాను. నల్లగొండ జిల్లాలో నాలుగువేల మెగావాట్ల పవర్ వచ్చేస్తే తెలంగాణ స్టేట్ మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అవతరిస్తుంది. మిషన్ భగీరథ ద్వారా శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని హైదరాబాద్ నగరంతోపాటు యావత్ రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలు ఉండే గోండు గూడేల్లో, కోయ గూడేల్లో, లంబాడీ తండాల్లో, 15 ఇండ్లున్న ఊళ్లకు కూడా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇస్తున్నాం. ఇటువంటిది భారతదేశంలో ఎక్కడా లేదు. కాంగ్రెస్ పాలనలో, 16 ఏండ్ల టీడీపీ పాలనలో ఎవడన్నా మహబూబ్నగర్కు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చారా? మేము మహబూబ్నగర్లో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేశాం.
నిన్ననే తొమ్మిది కాలేజీలు ప్రారంభించినం. నేడు తెలంగాణ సంవత్సరానికి 10 వేలమంది డాక్టర్లను తయారు చేసే రాష్ట్రంగా ఎదిగింది. దేశంలోనే జిల్లాకొక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. మామూలు స్కూల్ ఫీజంత ఫీజుతోనే ఎంబీబీఎస్ చదువుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. పేదిం టి పిల్లలకు బడిలో టిఫిన్ పెట్టేందుకు జీవో ఇచ్చాం. ఐఏఎస్ అధికారులను తమిళనాడుకు పంపి అధ్యయనం చేయించి ఇక్కడ కూడా అంతకన్నా మెరుగ్గా అమలుచేయాలని ఆదేశించినం. అక్కడ ఐదో తరగతి వరకే టిఫిన్ పెడుతుంటే మనం మాత్రం 10వ తరగతివరకు పెట్టాలని నిర్ణయించినం. మధ్యాహ్న భోజనం, కోడిగుడ్డు కూడా పెట్టాలని ఆదేశించాం. ఈ మే రకు జీవో కూడా విడుదలైంది. విద్య, వైద్యం, విద్యుత్తు, సాగునీరు తదితర రంగాల్లో ఒక్కో అడుగు ముందుకేస్తూ జీడీపీలో, తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్-1గా పురోగమిస్తున్నాం. తలమాసినోడు, నెత్తిమాసినోడు, తలకాయ లేనోడు ఏదేదో పైచ్చపు మాటలు మాట్లాడుతుంటారు. వాటిని పట్టించుకోవద్దు.
ఇప్పుడు ఎన్నికలు రాగానే ఆగమాగం చేస్తున్నారు. గంటలు పట్టుకొని వస్తారు.. మేమే చేసినం, మేము ఆరు చందమామలు పెడతం, ఏడు సూరీళ్లు పెడతం అంటారు. 70 ఏండ్లు ఏడ్చిన పాలమూరును నాడు ఎవ్వడూ పట్టించుకోలేదు. తెలంగాణను ధ్వంసం చేసింది ఈ కాంగ్రెస్సోళ్లు కాదా? తెలంగాణను ఉద్ధరిస్తా, నేను దత్తత తీసుకున్నా అని చెప్పి పునాదిరాళ్లు పాతి ప్రాజెక్టును పెండింగు పెట్టింది నాటి సీఎం చంద్రబాబు కాదా? మనం ఏడ్చిననాడు, వల స పోయిననాడు ఎవరన్నా సాయం చేసిన్రా? మన జిల్లా మొత్తం బొంబాయి బస్సులకు ఆలవాలం అయిననాడు, ఆగమాగం అయిననాడు ఎవరన్నా పట్టించుకున్నారా? మనం కొట్లాడి రాష్ట్రం సాధించుకొని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాం. ఈ క్రమంలో ఆగమైతే గోస పడతాం. ఇప్పుడు తోడేళ్లమాదిరి వస్తున్నవారు ఆనాడు ఎవ్వడూ మాట్లాడలేదు. ఉద్యమంనాడు ఎవ్వడూ రాలేదు. వలసపోయిన్నాడు ఎవ్వడూ రాలేదు.
బొంబాయికి బస్సుల్లో వలసపోతుంటే, ముసలి తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఎవ్వరూ రాలేదు. కవి గోరటి వెంకన్న ‘ వాగు ఎండీపాయెరా.. పెద్ద వాగు ఎండీపాయెరా’ అంటూ పాటలో ఏడ్చారు. నాడు దుందుభి నది దుమ్ముకొట్టుకొని పోయేది. ఎక్కడా చుక్క నీళ్లు ఉండేవికావు. అక్కడ చెక్డ్యామ్ నిర్మాణం తో నేడు నీటితో కళకళలాడుతున్నది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేసుకొంటున్నం. వాగులపై చెక్డ్యామ్లు నిర్మించుకుంటున్నం. వందల చెక్డ్యామ్లు జిల్లాలో కట్టుకున్నాం. భూగర్భజలాలు పెంచుకున్నం. ఇంకా ఈ అభివృద్ధి ముందుకు పోవాలి. ఇది ఆగం కావద్దు.. అది మీ చేతుల్లోనే ఉన్నది. మనం ఆగమై పిచ్చోళ్ల మాటలు పట్టుకుంటే మల్ల మొదటికే వస్తది. వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్టు అయితది.. తస్మాత్ జాగ్రత్త. ఉమ్మ డి మహబూబ్నగర్లో జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారాలి.. నా కండ్లతో నేను చూడాలి.. ఇది కేసీఆర్ ప్రతిజ్ఞ. 20 లక్షల ఎకరాల్లో పసిడి పంటలు పండే పాలమూరు జిల్లా కావాలి.. అదీ మన లక్ష్యం. అది సాధించేదాక, ఈ పనులు ముగించుకునేదాకా, ఇంకా అభివృద్ధి సాధించేదాక, పేదలను పైకి తెచ్చుకునేదాక మనం విశ్రమించకూడదు.
కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి అడిగినందుకుగాను కొల్లాపూర్ అభివృద్ధి సీఎం ప్రత్యేక నిధి నుంచి రూ. 25 కోట్లు మంజూరు చేస్తు న్నా. ఈ నిధులతో పట్టణంలోని అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని కూడా మంజూరు చేస్తున్నా. ఇక రెండు మూడు లిఫ్ట్లు కావాలని, తద్వారా గడ్డమీది ప్రాంతాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే కోరారు. జీల్దార్ తిప్ప లిఫ్ట్, బాచారం హై లెవల్ కెనాల్, పసుపులు బ్రాంచ్ కెనాల్, మల్లేశ్వరం మినీ లిఫ్ట్ కావాలని అడిగారు. వీటిపై వెంటనే సర్వే చేయించి, మంజూరు చేయిస్తా. ఈ లిఫ్ట్లను హర్షవర్ధన్రెడ్డితోనే ప్రారంభింపచేస్తా. రూ.10 కోట్లతో బోడగట్టు చెక్డ్యాం కూడా కావాలని ఎమ్మెల్యే అడిగారు.
దీనికి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తా. కొల్లాపూర్ వెనుకబడ్డ నియోజకవర్గం కాబట్టి.. స్థానిక సర్పంచులకు తీపి కబురు చెప్తున్న. నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.15 లక్షల చొప్పున ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నా. మహబూబ్నగర్ పట్టణంలోనూ జేఎన్టీయూ ద్వారా ఇంజినీరింగ్ కాలేజీ ని మంజూరు చేస్తాం. పాలమూరు జిల్లాపై నా కు ప్రత్యేక అభిమానం. రాష్ట్రమంతటా నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు ఇస్తున్నారు. ఇక్కడ మాత్రం నాలుగు వేల ఇండ్లు ఇవ్వాలి అని ఇక్క డి మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీలు కలిసి నన్ను అడిగారు. వాళ్ల కోరిక మేరకు మహబూబ్నగర్ జిల్లాలో నియోజకవర్గానికి నాలుగువేల ఇండ్లు ఇస్తాం. ఇందుకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా ఇచ్చాం. ఇక్కడ అందరికి వెయ్యి ఇండ్లు ఎక్కువగా వస్తాయి. నన్ను ఎంపీగా గెలిపించి తెలంగాణ సాధించే యోధుడిగా తయారు చేసిన పాలమూరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటది. భవిష్యత్తులోనూ మీ దీవెనలు ఇలాగే ఉండాలి అని ప్రజలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఉద్యమంలో మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించినప్పుడు మాట ఇచ్చాను. తెలంగాణ వస్తేనే మన సకల దరిద్రాలు మాయమవుతయని, మన నీళ్లు, నిధులు, హక్కులు మనకు వస్తాయని నాడు నేను చెప్పినట్టే తెలంగాణ రాకతో అవన్నీ సాధించుకొన్నాం. నేను పోరాటం ఎంత చేసినా, ఎన్ని దిక్కుల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసినా.. పాలమూరు ఎంపీగానే తెలంగాణ సాధించిన విషయం ఒక చరిత్రగా గుర్తుండిపోతుంది. మహబూబ్నగర్ జిల్లా కిరీటంలో ఆ కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన ప్రాజెక్టును మంజూరు చేసుకొని ఆ నీళ్లు చూస్తుంటే నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో నా జన్మ ధన్యమైంది. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాసైన రోజు, తెలంగాణ వచ్చిన రోజు నా హృదయం ఎంత పొంగిపోయిందో.. ఈ రోజు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పంపు ఆన్ చేసిన తర్వాత అంతే పొంగిపోయింది.
నేడు పాలమూరు నీళ్ల పొంగును చూస్తే ఒక నది పారినట్టు ఉన్నది. కృష్ణమ్మ తాండవం చేసినట్టుగా ఉన్నది. మనసు పులకరించే విధంగా అద్భుతమైన ఘట్టాన్ని నా కండ్లతో చూసి. నా ఒళ్లు నిలువెల్లా అణువణువంతా పులకరించిపోయింది. నా జీవితం ధన్యమైంది. ఒక్క పంపు పారుతుంటేనే ఓ వాగు పారినట్టు ఉన్నది. మొత్తం పంపులన్నీ పూర్తయితే…! త్వరగా పూర్తి కావాలె. కాలువలన్నీ పూర్తి కావాలి. మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలుదిగువన ఉన్న నల్లగొండలోని డిండి, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు కూడా నీళ్లు రావాలి. మన హక్కులు మనకు ఉన్నాయి. వాటిని సాధించుకోవాలి.
1975లో బచావత్ ట్రిబ్యూనల్ తీర్పు ఇచ్చే సమయంలో తెలంగాణ నుంచి ఏ ఒక్క నాయకుడూ గొంతెత్తి మాకు నీళ్లేవి.. మా మహబూబ్నగర్కు నీళ్లేవి? అని అడగలేదు. చివరికి ఆ బచావత్ జడ్జీలే ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో కలువకుండా ఉండి ఉంటే చాలా బాగుపడేది అని బాధపడి.. ఈ ప్రాంతం నాయకులు నీళ్లు అడుగకపోయినా వారే 17 టీఎంసీలతో జూరాల ప్రాజెక్టును మంజూరు చేశారు. ఆ ప్రాజెక్టుకు కూడా సాంకేతిక కారణాలు చెప్పి తాము సూచించిన చోటనే కట్టాలని ఆదేశించినట్టు బచావత్ ట్రిబ్యునల్ రికార్డుల్లో నేటికీ ఉన్నది. నీళ్లు లేనికాడ ఎలాంటి అలకేషన్లు లేవు. జూరాలకు అలకేషన్లు ఉన్నా 1981 వరకూ ప్రాజెక్టుకు ఒక్కడన్నా తట్టెడు మన్ను తియ్యలేదు.
పునాది రాయి కూడా వేయలేదు. 1981లో తెలంగాణ బిడ్డ అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పు నాది వేశారు. కానీ, ఆ పనులు కూడా నత్తనడకన నడిచీనడిచీ ఒక గుంట భూమికి కూడా నీళ్లు ఇవ్వలేని దుస్థికి వచ్చింది. 2001లో గులాబీ జెండా ఎగిరిన తర్వాత మహబూబ్నగర్లో మీటింగ్లు పెట్టి నీళ్ల కోసం తెలంగాణ ప్రజల పక్షాన గర్జించినం. నాటి సీఎం చంద్రబాబు, ఆయన తాబేదార్లు సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి అని చెప్పేవారు. ఏమయ్య ముఖ్యమంత్రి నువ్ పాలమూరును దత్తత తీసుకున్నవ్. మరి సమైక్య రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి అంటే.. అయిపోయిన జూరాలను ఎందుకు నింపుతలేవు అని నేను ప్రశ్నించిన. అప్పుడు మోకాళ్ల మీద పరుగుపెట్టి కర్ణాటక ప్రాజెక్టు డబ్బులు కడితే.. ఆ తర్వాత జూరాల కాలువలకు పనులు చేయిస్తే మన ఉద్యమం దెబ్బకు వాళ్లు ముందుకొచ్చి కొన్ని నీళ్లు ఇచ్చారు.
నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే ఇద్దరు ముగ్గురు బీజేపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని బస్సుకు అడ్డం వచ్చారు. నేనేం తప్పు చేసిన? నేనేమన్నా మోసం చేసిన్నా? ఈ జిల్లాలోని బీజేపీవాళ్లను ఒక్కటే అడుగుతున్నా.. మీకు సిగ్గు, శరం, లజ్జ ఉంటే.. చీమూ నెత్తురుంటే, పౌరుషం ఉంటే సమాధానం చెప్పాలి. పదేండ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మా తెలంగాణకు నీళ్లు అడిగనం. కృష్ణానదిలో మాకు ఎంత వాటా వస్తుందో తేల్చమని అడిగినం. చట్ట ప్రకారం ఇవ్వమని మోదీని అడిగినం. మేము పాలమూరు ఎత్తిపోతలు కట్టుకోవాలని అడిగితే.. ఇంతపెద్ద విశ్వగురువని చెప్పుకునే ప్రధానమంత్రి, మా అంత సిపాయిలు లేరని చెప్పుకునే బీజేపీ, ఇక్కడ పెద్దపెద్ద పోజులు కొట్టే నాయకులు, కార్యకర్తలు పదేండ్లుగా ఎందుకు ఏమీ చేయలేకపోయారు? రెండు రాష్ర్టాల మధ్య నీళ్లు పంచాలని కృష్ణా ట్రిబ్యునల్కు ఒక లేఖ రాయడానికి పదేండ్లు పడుతుందా? అక్కడ మోదీ కుయ్యనడు, కయ్యనడు. ఇక్కడ సిగ్గులేక బీజేపీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నరు. మీకు బుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే ఢిల్లీలో కూర్చొని కృష్ణా ట్రిబ్యునల్కు రిఫర్ చేయించాలి.
మేము నీళ్ల వాటా కోసం సుప్రీకోర్టును ఆశ్రయిస్తే నన్ను కేంద్ర నాయకులు పిలిచి కేసు ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్కు రిఫర్ చేస్తామని మాటిచ్చారు. ఈ మాటిచ్చి ఏడాది గడిచినా ఇంతవరకు అతీగతీ లేదు. అయినా సిగ్గులేని బీజేపీ నాయకులు తాము జాతీయ ఉపాధ్యక్షులమని, తోక, తొండెం అని అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. ఇటువంటి నా యకులను ప్రజలు నిలదీయాలి. పదేండ్లుగా కృష్ణా ట్రిబ్యునల్కు ఎందుకు రిఫర్ చేయడంలేదని బీజేపీ నాయకులను ప్రశ్నించండి. బీఆర్ఎస్ పోరాడుతుంటే మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారని అడగండి. బీజేపీ నాయకులకు సిగ్గు, లజ్జ ఉంటే ప్రధానికి చెప్పి కృష్ణా జలాల వాటా తేల్చాలి. ట్రిబ్యునల్కు రిఫర్ చేసేలా ఢిల్లీలో పోరాడాలి. అక్కడ పోరాడాల్సిందిపోయి కేసీఆర్కు జెండా పట్టుకొని అడ్డం వస్తరా? నా వెంబడి లక్షలమంది ప్రజలు ఉన్నరు. వాళ్లు ఊదితే మీరు నశంకింద పోతరు.
70 ఏండ్ల గోస, పళ్లు పటపట కొరికేది.. నా కండ్లలో రక్తం వచ్చేది. గంజి కేంద్రాలు పెడతరా పాలమూరులో? ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నా రాదా మనకు విముక్తి? చివరికి తెలంగాణ వచ్చిన తరువాత ప్రాజెక్టు ఎక్కడ పెట్టాలో ఆలోచన చేశాం. అతి తక్కువ భూములు పోయేవిధంగా రిజర్వాయర్లను, గుట్టలను ఆసరాగా చేసుకొని పాలమూరు-రంగారెడ్డికి రూపకల్పన చేశాం. పంపులు, రిజర్వాయర్లు అయిపోయాయి. కాలువలు కూడా త్వరలోనే పూర్తిచేస్తాం. ఈ ప్రాజెక్టు ముందుకు పోకుండా జిల్లా నాయకులే కేసులేశారు. దీంతో నెట్టెంపాడు, జూరాల, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసుకున్నాం. వీటి ద్వారా 8-10 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి.
కేఎల్ఐ ప్రాజెక్టును పెండింగ్లో పెడితే మేమే పూర్తిచేశాం. ప్రజలందరి ఆశీర్వాదంతో, భగవంతుని దయతో పాలమూరు ఎత్తిపోతల విషయంలో విజయం సాధించాం. కేంద్రానికి, ఆంధ్రా ప్రజలకు ఒక్కటే మనవి చేస్తున్నా.. మాకు ఎవరి నీళ్లు అవసరం లేదు. మేము ఎవరి సొమ్ము దోచుకోదలుచుకోలేదు. మా వాటా మాకు చెబితే దాని ప్రకారం నీళ్లు తీసుకుంటాం. తెలంగాణ ఆనాడు, ఈనాడు, ఏనాడూ ఇతరుల నీళ్లు అడగలేదు. మనకు కుల, మత, జాతి భేదం లేదు. తెలంగాణలోని నాలుగు కోట్ల బిడ్డలు మన బిడ్డలే. తెలంగాణలోని ప్రతి ఇంచు భూమికి నీళ్లు రావాలి. అందరూ బాగుపడాలి. అందరం ఐకమత్యంగా ముందుకు వెళ్లాలి. పెద్దపెద్ద రిజర్వాయర్లు, సాగునీళ్లు పుష్కలంగా రావడంతో మత్స్యకారులు వేల టన్నుల చేపలు ఉత్పత్తి చేసే అవకాశం వచ్చింది. ఈ చేపలు పట్టుకోవడంపై ఈ జిల్లాలోని ముదిరాజ్, మత్స్యకారులకే పూర్తి హక్కులు కల్పిస్తాం.