హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని నాలుగు విద్యుత్తు సంస్థలు (ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) కలిపి చేసిన అప్పుల మొత్తం రూ. 81,516 కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో విద్యుత్తుపై విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నది. ఇప్పటి వరకు డిస్కంలకు (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) వాటిల్లిన నష్టాలు రూ. 62,461 కోట్లు ఉన్నాయంటూ లెక్కలు తేల్చారు. ఇప్పటి వరకు విద్యుత్తును వాడుకున్న ఆయా ప్రభుత్వ శాఖల నుంచి రూ. 28,842 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.
విద్యుత్తు కొనుగోళ్లలో వాస్తవ సర్దుబాటు చార్జీల కింద (ట్రూఅప్ చార్జీలు) రూ. 14,928 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నదాని ప్రకారం.. నాలుగు విద్యుత్తు సంస్థలకు సంబంధించిన అప్పులు ఇలా ఉన్నాయి. డిస్కంల నష్టాలకు సంబంధించి రాష్ట్రం ఏర్పడేటప్పటికి అంటే 2-6-2014 నాటికి డిస్కంల (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) మొత్తం నష్టాలు రూ.12,186 కోట్లుగా ప్రభుత్వం చూపించింది. గడిచిన తొమ్మిదేండ్లలో (2022-23 నాటికి) అదనంగా రూ. 50,275 కోట్ల నష్టం వాటిల్లిందని, మొత్తం రూ. 62,461 కోట్ల నష్టాల్లో డిస్కంలు నడుస్తున్నట్టు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. విద్యుత్తు కొనుగోలు కోసం సింగరేణికి కూడా రూ. 19,431 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్టు అందులో వివరించారు.
2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం అప్పులు రూ. 78,548.92 కోట్లు కాగా, అక్టోబర్ 31, 2023 నాటికి ఈ అప్పుల మొత్తం రూ. 81,516 కోట్లకు చేరుకుందని ప్రభుత్వం శ్వేతపత్రంలో పేర్కొంది.